బీజేపీవి ఓపెన్‌ పాలిటిక్స్‌.. నమ్మక ద్రోహాన్ని సహించం.. ఆయనకు శిక్ష పడాల్సిందే.. అమిత్‌ షా

5 Sep, 2022 16:31 IST|Sakshi

ముంబై: రాజకీయాల్లో దేన్నైనా భరించొచ్చుగానీ.. ద్రోహాన్ని సహించలేమని అన్నారు బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. సోమవారం ముంబైలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రాజకీయాల్లో దేన్నైనా సహించగలంగానీ.. ద్రోహాన్ని సహించలేం. ఉద్దవ్‌ థాక్రే(శివసేన అధినేత) బీజేపీకి చేసింది ముమ్మాటికీ ద్రోహమే. అందుకే ఆయనకు అలా(ప్రభుత్వం కుప్పకూలి.. సీఎం పదవీచిత్యుడు అయ్యడు) జరిగింది. ఉద్దవ్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో మోసం చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అని షా వ్యాఖ్యానించారు.

శివసేన చీలడానికి, తదనంతర పరిణామాలకు ఉద్దవ్‌ థాక్రేనే కారణం. అతని అధికార దాహమే.. దగ్గరి వాళ్లను ఎదురు తిరిగేలా చేసింది. బీజేపీని మోసం చేయడమే కాదు.. నమ్మిన సిద్దాంతాలకు వెన్నుపోటు పొడిచారు. అంతేకాదు.. మహరాష్ట్ర ప్రజలను ఘోరంగా అవమానించారు. దురాశతో అతను చేసిన పని.. పార్టీని ముంచేసింది. ఉద్దవ్‌ థాక్రేను ముఖ్యమంత్రిని చేస్తామని ఏనాడూ మేం చెప్పలేదు. తలుపులు మూసుకుని గదుల్లో రాజకీయాలు చేయడం మాకు తెలియదు. మాకు తెలిసింది ఓపెన్‌ పాలిటిక్స్‌ అని అమిత్‌ షా అక్కడున్న నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

ఇక ముంబై స్థానిక సంస్థల ఎన్నికల కోసం మిషన్‌ 150ను తెరపైకి తెచ్చింది బీజేపీ. దేశంలోనే అత్యంత సంపన్నమైన పౌర సంస్థగా బృహణ్‌ముంబై కార్పొరేషన్‌కు పేరుంది. అందుకే దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ సుదీర్ఘ కాలం నుంచి ప్రయత్నిస్తోంది.

ఇదీ చదవండి: ‘2024లో బీజేపీకి రెండే సీట్లు.. ఎక్కడ మొదలయ్యారో అక్కడికే’

మరిన్ని వార్తలు