ఐసోలేషన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి.. అయోమయంలో కార్యకర్తలు

1 Apr, 2021 15:30 IST|Sakshi

కొచ్చి: మహమ్మారి కరోనా వైరస్‌ కల్లోలం రేపుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు అసెంబ్లీ ఎన్నికల వలన కూడా పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు, భారీగా జనాలు గుమిగూడడం వంటివి జరుగుతుండడంతో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. దీని ఫలితంగా తాజాగా ఓ ఎమ్మెల్యే అభ్యర్థికి పాజిటివ్‌ తేలింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఐసోలేషన్‌లో ఉండడంతో ప్రస్తుతం కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.

ఎన్నికల సందర్భంగా ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ - యూడీఎఫ్‌) కొచ్చి అభ్యర్థి టోనీ చమ్మని ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. అయితే తనకు కరోనా సోకిందని ఆయన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని.. ప్రచారం చేయలేనని చెప్పేశారు. దీంతో పార్టీ నాయకులు, ఆయన అనుచరులు ఆందోళనలో పడ్డారు. కొన్ని రోజుల్లో ఎన్నికలు ఉండగా ప్రజలను కలిసేందుకు అభ్యర్థి రాకపోతే దాని ప్రభావం పోలింగ్‌లో తెలుస్తుందని భయాందోళన చెందుతున్నారు. గెలిచే స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి టోనీ చమ్మని మాత్రం మీరు ప్రచారం చేసేయండి.. మనదే విజయం అని చెబుతున్నారు. ఈ విధంగా కరోనా వలన రాజకీయ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు