కోవిడ్‌ నిబంధనలతో కాలేజీలు ఓపెన్‌..

6 Nov, 2020 08:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ఎనిమిది నెలలుగా మూతబడిన యూనివర్సిటీలు, కాలేజీలు తెరిచేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. సెంట్రల్‌ యూనివర్సిటీలు, కేంద్ర నిధులతో పనిచేస్తున్న విద్యా సంస్థలను తెరిచే విషయమై నిర్ణయాధికారాన్ని వాటి వైస్‌ చాన్సలర్లు, హెడ్‌లకు ఇచ్చింది. రాష్ట్ర పరిధిలో ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, సూచనలకు అనుగుణంగా తెరచుకోవచ్చని సూచించింది. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్లు వంటి కోవిడ్‌ నిబంధనలను పాటించాలని చెప్పింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో విద్యా సంస్థలను తెరవరాదని యూజీసీ స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులను రానివ్వరాదని పేర్కొంది. ఆరోగ్యసేతు యాప్‌ వినియోగించేలా విద్యార్థులను, అధ్యాపకులను ప్రోత్సహించాల్సిందిగా చెప్పింది. అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక వెసులుబాట్లు చేసుకోవాలని తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో తెలిపింది. తగిన జాగ్రత్తలతో హాస్టళ్లు తెరచుకోవచ్చని సూచించింది. 

మరిన్ని వార్తలు