అడ్మిషన్లు రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు ఇచ్చేయాల్సిందే

21 Jul, 2021 08:34 IST|Sakshi

ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ ఆదేశం

సాక్షి, అమరావతి: విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు కోవిడ్‌ కారణంగా తమ అడ్మిషన్లను రద్దు చేసుకుంటే వారికి పూర్తి ఫీజులను వాపసు ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అన్ని ఉన్నత విద్యాసంస్థలను ఆదేశించింది. కోవిడ్, లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలు దెబ్బతిని పలు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నమై ఉన్నందున క్యాన్సిలేషన్‌ చార్జీలు వసూలు చేయకుండా వెనక్కిచ్చేయాలని కొత్త అకడమిక్‌ షెడ్యూల్‌తో విడుదల చేసిన మార్గదర్శకాల్లో సూచించింది.

అక్టోబర్‌ 31లోగా అడ్మిషన్లు రద్దు చేసుకున్న వారు, లేదా మైగ్రేషన్‌పై వేరే సంస్థల్లోకి చేరే వారి నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఫీజులను తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. డిసెంబర్‌ 31 లోపు అడ్మిషన్లు రద్దు చేసుకునే వారి నుంచి రూ.1000 వరకు క్యాన్సిలేషన్‌ ఫీజు వసూలు చేయాలని, అంతకు మించి వసూలు చేయరాదని పేర్కొంది. 
ఆఫ్‌లైన్‌లో పరీక్షల నిర్వహణ 

  • 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు టర్మినల్‌ సెమిస్టర్‌ పరీక్షలను పెన్‌ అండ్‌ పేపర్‌ ఆధారితంగా (ఆఫ్‌లైన్‌లో), లేదా ఆన్‌లైన్, బ్లెండెడ్‌ (ఆఫ్‌లైన్‌ ప్లస్‌ ఆన్‌లైన్‌) విధానాల్లో ఆగస్టు 31లోగా నిర్వహించాలని యూజీసీ పేర్కొంది.
  • ఇంటర్‌ ఫలితాలు విడుదల ఆలస్యమైనందున 2021–22 విద్యాసంవత్సరానికి  విద్యాసంస్థల్లో ప్రవేశాల ప్రక్రియను యూజీసీ అక్టోబర్‌ 1 నుం చి ప్రారంభించాలని కొత్త షెడ్యూల్‌లో పేర్కొం ది. ఈ విద్యార్థులకు ఫస్ట్‌ సెమిస్టర్‌ ప్రిపరేటరీ బ్రేక్, పరీక్షల నిర్వహణ అంశాలను  విద్యాసంస్థలు నిర్ణయించుకోవాలని వివరించింది.
మరిన్ని వార్తలు