ఆ వార్తలు అవాస్తవం.. చోటా రాజన్‌ బ్రతికే ఉన్నాడు!

7 May, 2021 18:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అండర్‌ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌ కరోనాతో మరణించాడంటూ మీడియాలో వెలువడుతున్న వార్తలపై తీహార్‌ జైలు డీజీ, ఎయిమ్స్‌ అధికారులు స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని, చోటా రాజన్‌ బ్రతికే ఉన్నాడని స్పష్టం చేశారు. తీహార్‌ జైలులో ఖైదీగా ఉన్న రాజేందర్‌ సదాశివ్‌ నికల్జే అలియాస్‌ చోటారాజన్‌కు గత నెల 22వ తేదీ కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆయనను 24వ తేదీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని జైలు డీజీ తెలిపారు. చోటా రాజన్‌ బ్రతికే ఉన్నాడని, ఎయిమ్స్‌లో చేరి కరోనాకు చికిత్స పొందుతున్నారని ఎయిమ్స్‌ అధికారులు ట్విటర్‌ వేదికగా స్పష్టత నిచ్చారు.

కాగా, అండర్‌ వరల్డ్‌ డాన్‌గా పేరు బడ్డ చోటా రాజన్‌ మొదట ముంబై డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడిగా ఉండేవాడు. దావూద్‌తో విబేధాల కారణంగా మరో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. రాజన్‌పై దాదాపు 70కిపైగా క్రిమినల్‌ కేసులున్నాయి.

మరిన్ని వార్తలు