యూపీ జిల్లా కోర్టులో కాల్పుల కలకలం.. అండర్‌ ట్రయల్‌ ఖైదీ మృతి

16 Aug, 2022 15:54 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపుర్‌ జిల్లా కోర్టు వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం అండర్‌ ట్రయల్‌ ఖైదీపై కాల్పులు జరిపారు. దీంతో తూటాలు తగిలి ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు, అండర్‌ ట్రయల్‌ ఖైదీ లఖన్‌పాల్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు హర్యానా నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు చెప్పారు.

ఈ సంఘటనలో అండర్‌ ట్రయల్‌ ఖైదీతో ఉన్న హర్యానా పోలీసు అధికారికి సైతం గాయలయ్యాయి. అయితే, కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అండర్‌ ట్రయల్‌ ఖైదీనే లక్ష్యంగా ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. గాయపడిన పోలీసు అధికారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. కాల్పులకు పాల్పడిన దుండగులను ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడే ఉన్న పోలీసులు సైతం వారిని పట్టుకునే ప్రయత్నం చేయకపోవటం వల్ల దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి: బీజేపీ కార్యాలయం ఎదుట కారు కలకలం.. బాంబు స్క్వాడ్‌కు సమాచారం!

మరిన్ని వార్తలు