Corona Virus Vaccine: 49 వేల మందిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. మరణించిన వారు ఎందరంటే

8 Dec, 2021 11:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మరణించిన వారు 946 (0.00008 శాతం)

అందుకు వ్యాక్సినే కారణమని నిర్ధారణ కాలేదు

రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా నవంబర్‌ 30నాటికి 127.93 కోట్ల మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె మంగళవారం సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్‌ వల్ల 49వేల మంది దుష్ప్రభావాలకు గురయ్యారని, మొత్తం వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఆ బాధితుల శాతం 0.004శాతమేనని ఆమె చెప్పారు.

49వేల మందిలో 47,691మందికి స్వల్ప లక్షణాలుండగా, 163 మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, 1,965 మంది మధ్యస్థంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. టీకా వేసుకున్న తరువాత మరణించిన వారు 946 (0.00008)వత్రమేనని ఆమె తెలిపారు. అందులో 89 మంది మరణానికి కారణాలను అంచనా వేశామని, అయితే వ్యాక్సినే కారణమని నిర్ధారణ కాలేదన్నారు. టీకా తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఎంతకాలముంటాయనే విషయంలో స్పష్టత రాలేదని చెప్పారు.

94 దేశాలకు 7.23కోట్ల డోసుల ఎగుమతి...
వ్యాక్సిన్‌ మైత్రి కార్యక్రమంలో భాగంగా  94దేశాలకు 7.23 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఎగుమతి చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. మొత్తం 150 దేశాలకు  కోవిడ్‌ సంబంధిత మందులను కూడా అందించామన్నారు.

1,509 మందికి పరిహారం
ఆరోగ్య రంగంలో పనిచేస్త కోవిడ్‌ కారణంగా 1,509 మంది చనిపోయారని మంత్రి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.22.12 లక్షల నుంచి రూ.50 లక్షలు అందించినట్టు తెలిపారు.
 

మరిన్ని వార్తలు