సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు పతకాలు అందించనున్నారు. కాగా సైనిక, పోలీస్ అధికారులకు కేంద్రహోంశాఖ వివిధ పతకాలు ప్రకటించింది. ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకం(పీపీఎంజీ), 628 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు(పీఎంజీ), 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎం), 662 మందికి విశిష్ట సేవా పతకాలను కేంద్రం హోంశాఖ ప్రకటించింది.
ఇక వీటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 11 మందికి, తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు దక్కాయి. తెలంగాణకు చెందిన 14 మంది పోలీసు అధికారులకు గ్యాలంటరీ పోలీసు పతకాలు, మరో 11 మందికి ఉత్తమ సేవా పోలీసు పతకాలు వరించాయి. తెలంగాణకు చెందిన అడిషనల్ డీజీపీ, వుమెన్ సేఫ్టీవింగ్ ఇంచార్జి స్వాతి లక్రా, జనగామ వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకాలు దక్కాయి. వీటిని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ అందజేయనున్నారు.