ఇది నయా భారత్‌...‘హద్దులు’ మీరితే అంతే 

4 May, 2022 00:45 IST|Sakshi
బసవేశ్వరునికి నివాళులర్పిస్తున్న అమిత్‌ షా

బెంగళూరు: ‘‘ఇది నయా భారత్‌. సరిహద్దుల వద్ద కవ్వింపునకు దిగితే ఎవరినీ ఉపేక్షించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్‌ తరహాలో గట్టిగా సైనిక భాషలోనే బదులిస్తోంది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఉరి, పుల్వామాల్లో ఉగ్రవాదుల దాడులకు సర్జికల్‌ దాడులతో మర్చిపోలేని రీతిలో బదులిచ్చామని గుర్తు చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశ భద్రతపై ఎన్నో విధాలుగా రాజీ పడిందని నిప్పులు చెరిగారు. పాక్‌ దన్నుతో ఉగ్రవాదులు దాడులకు దిగితే హెచ్చరిక ప్రకటనలతో సరిపెట్టేదన్నారు. కానీ మోదీ ప్రభు త్వం వచ్చాక పరిస్థితులన్నీ మారాయని చెప్పారు. మంగళవారం బెంగళూరులో నృపతుంగ వర్సిటీ ప్రారంభోత్సవం తదితరాల్లో షా పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్‌ 370, 35–ఏ రద్దు, పౌరసత్వ సవరణ బిల్లు అమలు వంటి పలు ఘనతలు మోదీ సర్కారు సొం తమన్నారు. ‘‘ఆర్టికల్‌ 370 రద్దు చేస్తే రక్తపాతం తప్పదన్న బెదిరింపులను బేఖాతరు చేస్తూ కశ్మీర్‌ను మిగతా భారత్‌లో కలిపేశారు మోదీ’’ అన్నారు.

బొమ్మైకి అమిత్‌ షా అభయం 
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని మారుస్తారన్న వార్తలకు అమిత్‌ షా చెక్‌పెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల దాకా బొమ్మై కొనసాగుతారని స్పష్టం చేసినట్లు తెలిసింది. సీఎం నివాసంలో విందులో షా పాల్గొన్నారు. పార్టీలో భిన్న స్వరాలు, అసమ్మతుల విషయం తాము చూసుకుంటామని సీఎంకు ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు