శివాజీపై గవర్నర్‌ వ్యాఖ్యల దుమారం.. ఎట్టకేలకు స్పందించిన నితిన్‌ గడ్కరీ

21 Nov, 2022 19:13 IST|Sakshi

ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. శివాజీపై మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా సంచలనంగా మారాయి. దీంతో, సీఎం ఏక్‌నాథ్‌ షిండే అనుకూల ఎమ్మెల్యేలు సైతం గవర్నర్‌ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. షిండే వ‌ర్గం-బీజేపీ కూట‌మిలో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. అంతటితో ఆగకుండా గవర్నర్‌ను బదిలీ చేయాలనే డిమాండ్‌ తెరమీదకు తెస్తున్నారు. 

ఈ క్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. బీజేపీ మిత్ర‌ప‌క్ష నేత‌, సీఎం ఏక్‌నాథ్ షిండే తీరును గ‌డ్క‌రీ సోమ‌వారం త‌ప్పుబ‌ట్టారు. ఈ సందర్భంగా నితిన్‌ గడ్కరీ.. శివాజీ మ‌హారాజ్ మాకు దేవుడు. మా త‌ల్లిదండ్రుల కంటే ఎక్కువ‌గా ఆయనను పూజిస్తాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, గడ్కరీ వ్యాఖ్యలతోనైనా మహారాష్ట్రలో ఈ పొలిటికల్‌ ప్రకంపనలకు తెరపడుతుందో లేదో చూడాల్సిందే.

అయితే, మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. మ‌హారాష్ట్ర‌లో చాలా మంది ఆరాధ్య నాయ‌కులు ఉన్నారు. ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ పాత‌కాలం నాటి ఆరాధ్య దైవం. ఇప్పుడు బీఆర్ అంబేద్క‌ర్‌, నితిన్ గ‌డ్క‌రీ ఉన్నారు అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు కూడా గవర్నర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. 

మరిన్ని వార్తలు