తెలంగాణకు బల్క్‌ డ్రగ్‌ పార్కు: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ

17 Dec, 2022 08:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు బల్క్‌ డ్రగ్‌ పార్కు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో..  బీఆర్‌ఎస్‌ ఎంపీ నామ నాగేశ్వరరావు తెలంగాణలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని కోరినప్పుడు.. కేంద్రమంత్రి సమాధానమిస్తూ దేశంలో 12వేలకుపైగా దేశంలో ఫార్మా సంస్థలున్నాయని వివరించారు. పీఎల్‌ఐ పథకంలో భాగంగా 2020–21 నుంచి 2024–25 మధ్య దేశంలో మూడు చోట్ల బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క పార్కుకు రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్కులకు ఆమోదం తెలిపామన్నారు.   

ఇన్ఫ్రాస్టక్చర్‌ మిషన్‌కు రూ.584.04 కోట్లు 
దేశంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ మిషన్‌కు 2021–22లో గత నవంబర్‌ 28 నాటికి  రూ.584.04 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మిషన్‌కు రూ.4,176.84 కోట్లు కేటాయించినట్లు ఎంపీ నామా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రూ.102.91 కోట్లు కేటాయించామన్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ఏపీలో 43137 మంది, తెలంగాణలో 32854 మంది ఆశా వర్కర్లు ఉన్నారని టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు.

ఇదీ చదవండి: బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటులో రాష్ట్రంపై వివక్ష

మరిన్ని వార్తలు