సివిల్‌ సర్వీస్‌ అధికారులపై బీజేపీ నేత ‘బందిపోటు’ కామెంట్లు.. ‘ఇంతకుముందు గౌరవం ఉండేది.. కానీ, ఇప్పుడు లేదు’

10 Apr, 2023 11:57 IST|Sakshi

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీపీఎస్సీ) ద్వారా నియమితులైన అధికారుల్లో చాలామంది బందిపోట్లే అంటూ బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోడి దొంగకు అయినా శిక్ష పడుతుందేమో గానీ మినరల్‌ మాఫియాను నడుపుతున్న అధికారులను అస్సలు టచ్‌ చేయలేం అన్నారు. ఈ మేరకు బాలాసోర్‌ జిల్లాలో బలియాపాల్‌లోని ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒడిశా ఎంపీ, గిరిజన వ్యవహారాలు, జలశక్తి సహాయ మంత్రి బిశేశ్వర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాను ఢిల్లీలో ఉండగా సివిల్‌ సర్వీస్‌ కార్యాలయం తన నివాసం వెనకాలే ఉండేదని, దానిపట్ల ఎంతో గౌరవం ఉండేదన్నారు. అప్పట్లో తనకు ఆ సర్వీస్‌ ద్వారా నియమితులైన వారందరూ అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులని, ఎల్లప్పుడూ ఉన్నత స్థానాల్లో ఉంటారనే భావన ఉండేదన్నారు. కానీ ఇప్పుడు తన ఆలోచన మారిందన్నారు. అక్కడ నుంచి వచ్చిన వారిలో చాలామందిని బందిపోటు దొంగలుగా భావిస్తున్నానని చెప్పారు.

అలా అని నూటికి నూరు శాతం అందరూ అలానే ఉన్నారని చెప్పడం లేదు. కొంతమంది మాత్రం అలానే ఉంటున్నారని నొక్కి చెప్పారు. మన విద్యా వ్యవస్థలో నైతికత లేకపోవటం వల్లే ఇలాంటి చదువుకున్న వ్యక్తుల అవినీతిని సమాజం భరించాల్సి వస్తోందంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు.  
(చదవండి: జంషెడ్‌డ్‌పూర్‌లో ఘర్షణ..రంగంలోకి ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌)

మరిన్ని వార్తలు