అరుదైన ‘ఈఎంఎం’ బ్లడ్‌ గ్రూప్‌..మన దేశంలోనే తొలి వ్యక్తి.. ప్రపంచవ్యాప్తంగా?

13 Jul, 2022 18:31 IST|Sakshi

అహ్మదాబాద్‌: మనుషుల్లో బ్లడ్‌ గ్రూప్‌లు సాధారణంగా ఏ, బీ, ఓ, లేదా ఏబీ అని ఉంటాయని అందరికీ తెలుసు. కానీ, గుజరాత్‌కు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తిలో కొత్తరకం బ్లడ్‌ గ్రూప్‌ కనుగొన్నారు వైద్యులు. దేశంలోనే అరుదైన రక్తం కలిగిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అయితే.. ఇలా ప్రత్యేక రక్త సమూహం కలిగిన వ్యక్తులను గుర్తించటం ప్రపంచవ్యాప్తంగా ఇది 10వ కేసుగా పలు నివేదికలు వెల్లడించాయి. 

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తిలో 'ఈఎంఎం నెగెటివ్‌' బ్లడ్‌ గ్రూప్‌ను కనుగొన్నారు వైద్యులు. సాధారణంగా మానవ శరీరంలో నాలుగు రకాల బ్లడ్‌ గ్లూప్‌లు ఉంటాయి. అందులో ఏ, బీ, ఓ, ఆర్‌హెచ్‌, డఫ్పీ అంటూ 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. అలాగే.. ఈఎంఎం అధికంగా ఉండే 375 రకాల యాంటీజెన్లు ఉంటాయి. ఈఎంఎం నెగెటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ కలిగిన వ్యక్తులు ఇతరులకు తన రక్తాన్ని ఇవ్వలేరు.. ఇతరుల నుంచి తీసుకోలేరు.

ఎలా నిర్ధారించారు?
రాజ్‌కోట్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో అహ్మదాబాద్‌ ఆసుపత్రిలో చేరారు. గుండె ఆపరేషన్‌ చేయాల్సి రావటం వల్ల రక్తం అవసరమైంది. ఆసుపత్రిలోని ల్యాబ్‌లో రక్తం పరీక్షించగా గ్రూప్‌ తెలుసుకోలేకపోయారు. దీంతో రక్తం నమూనాలను సూరత్‌లోని రక్త నిధి సేకరణ కేంద్రానికి పంపించినట్లు అక్కడి వైద్యులు సన్ముఖ్‌ జోషీ తెలిపారు. ఆ రక్తాన్ని పరీక్షించగా ఏ గ్రూప్‌తోనూ సరిపోలలేదు. దీంతో వృద్ధుడితో పాటు అతడి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను అమెరికాకు పంపించినట్లు చెప్పారు జోషీ. దీంతో అరుదైన బ్లడ్‌ గ్రూప్‌గా తేలిందన్నారు. రక్తంలో ఈఎంద్‌ లేకపోవటం వల్ల దానిని ఈఎంఎం నెగెటివ్‌గా ఐఎస్‌బీటీ నామకరణ చేసినట్లు చెప్పారు.  

ప్రపంచవ్యాప్తంగా 10 మంది మాత్రమే.. 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 మందిలో మాత్రమే ఇలాంటి అరుదైన ప్రత్యేక బ్లడ్‌ గ్రూప్‌లను కనుగొన్నారు. తాజాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తిలో అలాంటి అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ను కొనుగొన్న నేపథ్యంలో ఆ సంఖ్య 10కి చేరింది.

ఇదీ చూడండి: ప్లాస్టిక్‌ను తినేసే 'రోబో ఫిష్‌'.. సముద్రాల స్వచ్ఛతలో కీలక అడుగు!

మరిన్ని వార్తలు