కొత్త కరోనా ఎఫెక్ట్‌: బ్రిటన్‌ ప్రధాని పర్యటన రద్దు

5 Jan, 2021 17:50 IST|Sakshi

 గణతంత్ర దినోత్సవ  వేడుకకు ముఖ్య అతిధిగా రావాల్సిన బ్రిటన్‌ ప్రధాని  పర్యటన రద్దు

కొత్త కరోనా కారణంగా  టూర్‌ రద్దు చేసుకున్న బోరిస్ జాన్సన్

సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్‌ విజృంభణ కారణంలో బ్రిటన్‌ ప్రధానమంత్రి  బోరిస్ జాన్సన్  కీలక నిర్ణయం తీసుకున్నారు.  స్ట్రెయిన్‌ కారణంగా బోరిస్ జాన్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. మహమ్మారి  నివారణ చర్యలను పర్యవేక్షించాల్సిన  అవసరాన్ని పేర్కొంటూ  ఆయన తన టూర్‌ను  విరమించుకున్నారు. ఈ మేరకు  జాన్సన్‌ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడారు.  గత రాత్రి ప్రకటించిన జాతీయ లాక్‌డౌన్‌, కొత్త కరోనావైరస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో తాను దేశంలో ఉండడం చాలా ముఖ్యం అని ప్రధాని పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం ఈ నెలాఖరులో భారతదేశాన్ని సందర్శించలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. (దేశంలో విస్తరిస్తున్న కొత్త కరోనా)

జనవరి 26, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కావాల్సి వుంది.  అయితే కొత్తరకం కరోనా స్ట్రెయిన్  ప్రకంపనలు కొనసాగుతుండటంతో యూకేలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని సోమవారం ప్రకటించారు. దేశంలోని చాలా ప్రాంతం ఇప్పటికే కఠిన ఆంక్షల్లో ఉందనీ, కొత్త వేరియంట్‌‌ను నియంత్రించడం అత్యంత క్లిష్టమని, అందుకే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చిందని,  కొత్త మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందకు మరింతగా శ్రమించాల్సి ఉందని జాన్సన్  పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు