Boris Johnson India Tour: గుజరాత్‌లో బ్రిటన్‌ ప్రధాని పర్యటన, లైవ్‌ అప్‌డేట్స్‌

21 Apr, 2022 14:27 IST|Sakshi

TIME: 02.30PM
గుజరాత్‌ను సందర్శించిన మొదటి బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అదానీ హెడ్‌క్వార్టర్స్‌లో ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

TIME: 02.00PM
భార‌త ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్స‌న్ భారీ పెట్టబడుల ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించారు. భారత్‌-యూకే మధ్య 1  బిలియన్‌ పౌండ్ల విలువైన కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు బోరిస్‌ తెలిపారు. వాణిజ్యం, పెట్టుబ‌డులు, సాంకేతిక భాగ‌స్వామ్యంలో నూత‌న ఒర‌వ‌డికి నాంది ప‌లుకుతామ‌ని అన్నారు. ఇ 5జీ టెలికాం నుంచి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, వైద్యారోగ్య రంగంలో ప‌రిశోధ‌న‌ల వ‌ర‌కూ ప‌లు రంగాల్లో ఇరు దేశాలు క‌లిసి ప‌నిచేస్తూ పురోగ‌తి సాధిస్తాయ‌ని అన్నారు.

TIME: 12.50PM
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో బోరిస్‌ జాన్సన్‌ గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం శాంతిగ్రామ్ నుంచి బ్రిటన్‌ ప్రధాని బయలుదేరారు

TIME: 12.00PM
న్యూ ఇండియా వ్యాపార,పెట్టుబడుల ఒప్పందాల ద్వారా కొత్తగా 11 వేల యూకే ఉద్యోగాలు లభిస్తాయని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు.  కే- భారత్‌ భాగస్వామ్యం తమ ప్రజలకు ఉద్యోగాలు, వృద్ధి, అవకాశాలు అందిస్తోందన్నారు.  ఈ మేరకు బోరిస్‌ జాన్సన్‌ కార్యాలయం ట్వీట్‌ చేసింది.

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన  భారత్‌లో ఉండటం చాలా అద్భుతంగా ఉందని యూకే పీఎం బోరిస్ జాన్సన్ అన్నారు.  మన గొప్ప రెండు దేశాలు కలిసి సాధించే ఎన్నో విస్తృత అవకాశాలను చూస్తున్నానని పేర్కొన్నారు. మన పవర్‌ఫుల్‌ భాగస్వామ్యం ఉద్యోగాలు, వృద్ధి, అవకాశాలను అందిస్తుందని. ఈ భాగస్వామ్యాన్ని రాబోయే రోజుల్లో బలోపేతం చేయడానికి  ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

TIME: 11.00AM
►యూకే పీఎం బోరిస్‌ జాన్సన్‌ గాంధీ సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో ఆయన చరఖా తిప్పారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. సత్యం, అహింస వంటి మార్గాలతో ప్రపంచాన్ని కదిలించిన మహనేత గాంధీ అని కొనియాడారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో మహత్మా గాంధీ శిష్యురాలిగా మారిన బ్రిటీష్‌ అడ్మిరల్‌ కూతురు మడేలిన్‌ స్లేడ్‌(మీరాబెన్‌) ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానికి సబర్మతి ఆశ్రమం వారు  బహుమతిగా అందజేయనున్నారు.

న్యూఢిల్లీ: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్‌కు చేరుకున్నారు. బ్రిటన్‌ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయన ల్యాండ్‌ అయ్యారు. బ్రిటన్‌ ప్రధానికి అహ్మదాబాద్‌ విమనాశ్రయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి, గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌, తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడ పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు.

గుజరాత్‌ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తోన్న జాన్సన్‌.. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీతో కాసేపట్లో భేటీ కానున్నాను. అనంతరం ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌ సిటీని సందర్శించనున్నారు. అలాగే గాంధీనగర్‌లోని అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించనున్నాను. శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అవుతారు. వీరు రక్షణ, దౌత్య, ఆర్థిక రంగాల్లో వ్యూహాత్మక బంధాలపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. అలాగే ఇండో-పసిఫిక్‌ప్రాంత పరిస్థితులు, ఇంధన భద్రత, రక్షణ విషయాల్లో భాగస్వామ్యం వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

కాగా ఇప్పటి వరకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత్‌కు రాలేదు.  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రతరమై అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న వేళ...  బ్యాంకులను వేల కోట్లకు మోసగించిన విజయ్‌ మాల్యా వంటివారు బ్రిటన్లో తలదాచుకున్న నేపథ్యంలో... బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తొలిసారిగా భారత్‌ పర్యటనకు వస్తుండటం ఆసక్తి రేపుతోంది. అంతేకాక ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం బోరిస్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి బ్రిటన్‌కు వెళ్లలేదు. 

అహ్మదాబాదే ఎందుకు ?  
బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నేరుగా అహ్మదాబాద్‌ ఎందుకు వస్తున్నారన్నది చర్చనీయంగా మారింది. బ్రిటన్‌లో నివసించే ఆంగ్లో ఇండియన్‌ జనాభాలో సగం మందికి పైగా అహ్మదాబాద్‌కు చెందిన వారే. అయినా ఇప్పటిదాకా ఏ బ్రిటన్‌ ప్రధానీ గుజరాత్‌లో అడుగు పెట్టలేదు. ఆంగ్లో ఇండియన్‌ ఓటు బ్యాంకుని దృష్టిలో ఉంచుకొనే జాన్సన్‌ తొలుత అహ్మదాబాద్‌ వెళ్తున్నట్టు బ్రిటన్‌ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, ఈ ఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో జాన్సన్‌ పర్యటన ద్వారా ఎన్నికల్లో లబ్ధికి మోదీ ప్రయత్నిస్తున్నారన్న వాదనా ఉంది. గుజరాత్‌ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం గనుక పరస్పరం పెట్టుబడులు ఆకర్షించాలన్నదే కారణమని కూడా చెప్తున్నారు. 

మరిన్ని వార్తలు