సీఏపీఎఫ్‌(ఏసీ)–2021: సాయుధ దళాల్లో సాహస కొలువు!

27 Apr, 2021 18:00 IST|Sakshi

సీఏపీఎఫ్‌(ఏసీ)–2021 నోటిఫికేషన్‌

దరఖాస్తులకు చివరి తేది: మే 5, 2021

బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో ‘భద్రత’నిచ్చే కెరీర్‌

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌(సీఏపీఎఫ్‌–ఏసీ).. ధైర్య సాహసాలతోపాటు దేశ సేవ చేయాలనే తపన ఉన్న యువతకు చక్కటి మార్గంగా నిలుస్తోంది. కేంద్ర సాయుధ దళాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ నియామకాలకు సంబంధించి.. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. సీఏపీఎఫ్‌(ఏసీ)– 2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. సీఏపీఎఫ్‌ పరీక్ష వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, కెరీర్‌ అవకాశాల గురించి తెలుసుకుందాం.. 

సీఏపీఎఫ్‌(ఏసీ)... కేంద్ర సాయుధ రక్షణ దళాలైన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూ రిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌), ఇండో–టిబెటిన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) విభాగాల్లో అసి స్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష. ఈ పరీక్షను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తుంది. తాజాగా 2021కు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది.

మొత్తం పోస్టుల సంఖ్య–159
సీఏపీఎఫ్‌ (ఏసీ) ఎగ్జామ్‌.. ద్వారా మొత్తం అయిదు విభాగాల్లో 159 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు.. బీఎస్‌ఎఫ్‌–35; సీఆర్‌పీఎఫ్‌–36, సీఐఎస్‌ఎఫ్‌–67, ఐటీబీపీ–20, ఎస్‌ఎస్‌బీ–01. ఐటీబీపీకి సంబంధించి 20 ఖాళీల్లో 13 ఖాళీలు బ్యాక్‌లాగ్‌ ఖాళీలుగా యూపీఎస్‌సీ పేర్కొంది.

అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: ఆగస్ట్‌ 1, 2021 నాటికి 20 నుంచి 25ఏళ్ల మధ్యలో ఉండాలి(ఆగస్ట్‌ 2, 1996–ఆగస్ట్‌ 1, 2001 మధ్యలో జన్మించి ఉండాలి). ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. వీటితోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తమ సర్వీస్‌ ప్రిఫరెన్స్‌ను తెలియజేయాలి. మహిళా అభ్యర్థులకు ఐటీబీపీకి అర్హత లేదు. 

ఎంపిక ప్రక్రియ.. మూడు దశలు
సీఏపీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. అవి..రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ.


మొదటి దశ.. రాత పరీక్ష
ఎంపిక ప్రక్రియ మొదటి దశలో రాత పరీక్ష జరుగుతుంది. రాత పరీక్ష మొత్తం 450 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌–1 జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ 250 మార్కులకు; పేపర్‌–2 జనరల్‌ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌ 200 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌–1కు రెండు గంటలు, పేపర్‌–2కు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.

పేపర్‌–1 ఆబ్జెక్టివ్‌ విధానం
జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ పేపర్‌లో.. సమకాలీన అంశాలపై అవగాహన, జనరల్‌ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 125 ప్రశ్నల్లో భారత చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, పర్యావరణం–జీవ వైవిధ్యం, కరెంట్‌ అఫైర్స్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్‌లో మంచి మార్కు లు సాధించాలంటే.. ముందుగా సిలబస్‌లో పేర్కొన్న టాపిక్స్‌కు సంబంధించి ఆరు నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. దీనివల్ల అన్ని అంశాల బేసిక్స్, ఫార్ములాలపై అవగాహన ఏర్పడుతుంది. కరెంట్‌ అఫైర్స్‌ కోసం ఆర్థిక–రాజకీయ పరిణా మాలపై దృష్టిసారించడం ఉపకరిస్తుంది. దీంతోపాటు చరిత్రలో ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం–ముఖ్య ఘట్టాలు–వ్యక్తులపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇటీవల కాలంలో దేశ రక్షణ, భద్రత విభాగాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, కొత్త క్షిపణుల ప్రయోగాలు, దేశ రక్షణ–భద్రతకు సంబంధించి పలు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై పూర్తి అవగాహన పొందడం మరింత మేలు చేస్తుంది.  

పేపర్‌–2 భావ వ్యక్తీకరణ
► జనరల్‌ స్టడీస్, ఎస్సే అండ్‌ కాంప్రహెన్షన్‌ అంశాల్లో నిర్వహించే పేపర్‌–2 రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్‌–ఎలో ఎస్సే కొశ్చన్స్‌ అడుగుతారు. ఈ ఎస్సే రైటింగ్‌ విభాగంలో నిర్దేశిత అంశాలపై మూడు వందల పదాలకు మించకుండా చిన్నపాటి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. పార్ట్‌–ఎకు 80 మార్కులు కేటాయించారు.

► పార్ట్‌–బిలో 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రెసిస్‌ రైటింగ్, రిపోర్ట్‌ రైటింగ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లపై ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో రాణించాలంటే.. అభ్యర్థులకు బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌పై పట్టుతోపాటు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్‌ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి.. అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగానే 300 పదాల్లో సారాంశాలను క్రోడీకరించడం ప్రాక్టీస్‌ చేయాలి. 

రెండో దశ–ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌
పేపర్‌–1, పేపర్‌–2లలో నిర్ణీత కటాఫ్‌ మార్కులు సొంతం చేసుకున్న అభ్యర్థులకు రెండో దశలో ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఈ ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ నాలుగు విభాగాల్లో(వంద మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌ జంప్, షాట్‌పుట్‌) ఉంటుంది. వీటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. ఇందులో పురుషులు, మహిళలకు వేర్వేరు సమయాలు ఉంటాయి. అవి.. 

► లాంగ్‌జంప్‌ విభాగంలో గరిష్టంగా మూడుసార్లు పోటీ పడే అవకాశం ఉంటుంది. షాట్‌పుట్‌ నుంచి మహిళలకు మినహాయింపు ఉంది. 
► ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లో రాణించడానికి అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్‌ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రతి రోజు కనీసం రెండు గంటలు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లో పేర్కొన్న అంశాలపై శిక్షణ పొందాలి. ఈ ఫిజికల్‌ ప్రాక్టీస్‌ ఉదయం వేళల్లో చేస్తే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు. 

చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ
మొదటి రెండు దశల్లోనూ రాణించి.. మెరిట్‌ జాబితాలో నిలిచిన వారిని చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. దీనికి 150 మార్కులు కేటాయిం చారు. ఇంటర్వ్యూలో ప్రధానంగా అభ్యర్థుల్లో సాయుధ దళాల్లో విధులు నిర్వర్తించగలిగే సామర్థ్యాలు, దృక్పథాన్ని పరీక్షిస్తారు. 

సర్వీసులు.. శిక్షణ
మూడు దశల ఎంపిక ప్రక్రియలో రాణించి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు  పొందిన ర్యాంకు, సర్వీస్‌ ప్రిఫరెన్స్‌ ఆధారంగా శాఖను కేటాయిస్తారు. తర్వాత దశలో సుమారు ఏడాదిపాటు ఆయా దళాల్లో శిక్షణ ఉంటుంది. అది కూడా పూర్తి చేసుకుంటే.. గ్రూప్‌–ఎ గెజిటెడ్‌ హోదాలో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధుల్లో చేరొచ్చు.  

సీఏపీఎఫ్‌ ఏసీ నుంచి డీజీ స్థాయి వరకు
సీఏపీఎఫ్‌ ఏసీ ఎంపిక ప్రక్రియలో ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్‌ కమాండెంట్‌గా కొలువులు సొంతం చేసుకున్న వారు.. భవిష్యత్తులో పదోన్నతుల కోణంలో ఆయా దళాల్లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ లేదా అంతకంటే ఉన్నతమైన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ స్థాయికి చేరుకోవచ్చు. కెరీర్‌లో అత్యంత ప్రతిభ చూపిన వారు ఆయా దళాల్లో అత్యున్నతమైన అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది.  

అసిస్టెంట్‌ కమాండెంట్‌ కెరీర్‌.. ఇలా
► ఆరేళ్ల సర్వీసు తర్వాత డిప్యూటీ కమాండెంట్‌గా పదోన్నతి.
► ఆరు నుంచి 12 ఏళ్ల సర్వీసుతో రెండో ఇంచార్జ్‌ కమాండెంట్‌గా పదోన్నతి.
► 16 నుంచి 20 ఏళ్ల సర్వీసుతో కమాండెంట్‌ హోదా.
► 20 నుంచి 23 ఏళ్ల సర్వీసుతో డీఐజీగా పదోన్నతి.
► 23 నుంచి 26 ఏళ్ల సర్వీసుతో ఐజీ హోదా.
► కెరీర్‌లో అత్యంత ప్రతిభా పాటవాలు చూపితే అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ హోదాను కూడా సొంతం చేసుకోవచ్చు.


ప్రిపరేషన్‌ టిప్స్‌
ప్రిపరేషన్‌ పరంగా అభ్యర్థులు గత ప్రశ్న పత్రాల సాధన,  రైటింగ్‌ ప్రాక్టీస్‌తోపాటు వొకాబ్యులరీపై పట్టు పెంచుకోవాలి. అలాగే ప్రిపరేషన్‌ పూర్తి చేశాక.. ముఖ్యాంశాలతో సొంత నోట్స్‌ రూపొందించుకోవడం పరీక్షకు ముందు రివిజన్‌కు ఉపయోగపడుతుంది. అలాగే మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా పరీక్షలో విజయానికి దోహదపడుతుందని చెప్పొచ్చు. 

సీఏపీఎఫ్‌ (ఏసీ)–2021 ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మే 5, 2021.
► దరఖాస్తుల ఉపసంహరణ అవకాశం: మే 12 నుంచి మే 18 వరకు.
► సీఏపీఎఫ్‌ రాత పరీక్ష తేదీ: ఆగస్ట్‌ 8, 2021.
► తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.upsc.gov.in
► ఆన్‌లైన్‌ దరఖాస్తుకు వెబ్‌సైట్‌: upsconline.nic.in

మరిన్ని వార్తలు