ఎన్‌డీఏ, ఎన్‌ఏ 2021: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు

22 Jun, 2021 13:35 IST|Sakshi

ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2)–2021 నోటిఫికేషన్‌ విడుదల

ఇంటర్‌ అర్హతతోనే త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగం

శిక్షణ సమయంలో నెలకు రూ.56వేలకు పైగా స్టయిఫెండ్‌

శిక్షణ పూర్తి చేసుకుంటే బీఏ, బీఎస్‌సీ, బీటెక్‌ సర్టిఫికెట్లు కూడా

ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసుకొని.. ఉన్నత కొలువుతోపాటు చదువు కూడా కొనసాగించాలనుకునే వారికి చక్కటి అవకాశం.. యూపీఎస్‌సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌! ఈ పరీక్షలో ప్రతిభ చూపితే త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకు హోదాతో ఉన్నత ఉద్యోగం లభిస్తుంది! 21 లేదా 22ఏళ్ల వయసులోనే.. త్రివిధ దళాల్లో అడుగుపెట్టి.. ఉజ్వల కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు!! శిక్షణ సమయంలోనే నెలకు రూ.56వేలకుపైగా అందుకోవచ్చు. తాజాగా ఎన్‌డీఏ,ఎన్‌ఏ(2)–2021కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఎన్‌డీఏ, ఎన్‌ఏ వివరాలు, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్, శిక్షణ, కెరీర్‌ స్కోప్‌పై ప్రత్యేక కథనం.. 

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీలను సంక్షిప్తంగా ఎన్‌డీఏ, ఎన్‌ఏగా పేర్కొంటారు. ఉత్సాహవంతులైన, సాహసవంతులైన యువతను త్రివిధ దళాలకు ఎంపిక చేసే ఉద్దేశంతో యూపీఎస్సీ ఏటా రెండుసార్లు ఎన్‌డీఏ, ఎన్‌ఏ నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఎన్‌డీఏ, ఎన్‌ఏ అకాడమీల్లో శిక్షణ పూర్తయ్యాక ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, నేవల్‌ అకాడమీలలో పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకుతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు.. ఒకే సమయంలో కొలువుతోపాటు బీఏ/బీఎస్‌సీ/బీటెక్‌ పట్టాను సొంతం చేసుకునేందుకు మార్గం ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష.

► మొత్తం ఖాళీల సంఖ్య: 400
► నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ: 370 (ఆర్మీ–208; నేవీ–42; ఎయిర్‌ ఫోర్స్‌–120)
► నేవల్‌ అకాడమీ:10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌:30
► ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీకి కేటాయించిన ఖాళీ ల్లో 28 ఖాళీలను గ్రౌండ్‌ డ్యూటీ విభాగంలో భర్తీ చేస్తారు. 


అర్హతలు
ఆర్మీ వింగ్‌: ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
► ఎయిర్‌ఫోర్స్, నేవీ, నేవల్‌ అకాడమీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వయోపరిమితి: జనవరి 2,2003–జనవరి 1, 2006 మధ్యలో జన్మించి ఉండాలి.


రెండంచెల ఎంపిక ప్రక్రియ

► ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. ముందుగా యూపీఎస్సీ.. ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా.. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకొని.. మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. వీరికి తదుపరి దశలో ఎస్‌ఎస్‌బీ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్‌–పర్సనాలిటీ టెస్ట్‌ ఉంటుంది. 

► ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతాయి. పేపర్‌ 1–మ్యాథమెటిక్స్‌–300 మార్కులకు; పేపర్‌ 2–జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌–600 మార్కులకు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 900 మార్కులకు రాత పరీక్ష జరుగుతుంది. ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. 

► జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌లో.. పార్ట్‌–ఎలో ఇంగ్లిష్‌ 200 మార్కులకు; పార్ట్‌–బీలో 400 మార్కులకు జనరల్‌ నాలెడ్జ్‌ పరీక్ష ఉంటుంది. 

► పేపర్‌–2 పార్ట్‌–బిలో మొత్తం ఆరు విభాగాలు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్‌ సైన్స్, హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ; కరెంట్‌ ఈవెంట్స్‌) నుంచి ప్రశ్నలడుగుతారు. ఫిజిక్స్‌కు 25 శాతం; కెమిస్ట్రీకి 15శాతం, జనరల్‌ సైన్స్‌కు 10 శాతం, హిస్టరీ,స్వాతంత్య్రోద్యమానికి 20 శాతం, జాగ్రఫీకి 20 శాతం, కరెంట్‌ ఈవెంట్స్‌కు పది శాతం వెయిటేజీ ఉంది. పేపర్‌–1, పేపర్‌–2లలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు సాధించిన వారిని తదుపరి దశకు ఎంపిక చేస్తారు. 


మలి దశ.. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ

► ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షలో విజయం సాధించి.. మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు మలిదశలో 900 మార్కులకు ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

► అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలు, రాత పరీక్షలో పొందిన మెరిట్‌ ఆధారంగా.. ఎస్‌ఎస్‌బీ(సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌) నిర్వహించే ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌లోనూ నెగ్గాల్సి ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్‌ విభాగాన్ని ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టమ్‌లో కూడా విజయం సాధించాలి. 

► ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటెలిజెన్స్‌ టెస్ట్, వెర్బల్‌ టెస్ట్, నాన్‌ వెర్బల్‌ లెస్ట్, సామాజిక అంశాలపై ఉన్న అవగాహన, తార్కిక విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షిస్తారు. అదే విధగా పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. మొత్తం అయిదు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 

ఎన్‌డీఏ, ఎన్‌ఏలో శిక్షణ
ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లోనూ విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు వారు ఎంచుకున్న విభాగం ఆధారంగా శిక్షణ ఉంటుంది. తొలుత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ)లో మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు. మొదటి రెండున్నర సంవత్సరాలు అన్ని విభాగాల అభ్యర్థులకు ఉమ్మడి శిక్షణ ఉంటుంది. చివరి ఆరు నెలలు అభ్యర్థులు ఎంపికైన విభాగం ఆధారంగా ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. ఇలా మొత్తం మూడేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా జేఎన్‌యూ–ఢిల్లీ.. బీఏ, బీఎస్‌సీ, బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) డిగ్రీలను అందిస్తుంది. ఎయిర్‌ఫోర్స్, నేవల్‌ విభాగాలను ఎంచుకున్న వారికి బీటెక్‌ పట్టా లభిస్తుంది. 

నేవల్‌ అకాడెమీ 10+2 క్యాడెట్‌ ఎంట్రీ
ఎన్‌ఏ 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన వారికి నేవల్‌ అకాడమీ(ఎజిమల)లో నాలుగేళ్లపాటు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. ఆ తర్వాత వీరికి అప్లైడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, నేవల్‌ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్‌ సర్టిఫికెట్‌ అందిస్తారు. 


ఫిజికల్‌ ట్రైనింగ్‌

ఎన్‌డీఏలో మూడేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఎంపికైన విభాగంలో మళ్లీ ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. ఆర్మీ క్యాడెట్లకు ఐఎంఏ(డెహ్రాడూన్‌), నేవీ క్యాడెట్స్‌కు నేవల్‌ అకాడమీ(ఎజిమల), ఎయిర్‌ఫోర్స్‌ క్యాడెట్లకు ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ(హైదరాబాద్‌)లలో ఫీల్డ్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. శిక్షణ సమయంలో రూ.56,100 స్టయిఫండ్‌గా లభిస్తుంది. ఫీల్డ్‌ ట్రైనింగ్‌ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి రూ.56,100–1,77,500 వేతన శ్రేణితో కెరీర్‌ ప్రారంభం అవుతుంది. ప్రాథమికంగా ఆర్మీ విభాగంలో లెఫ్ట్‌నెంట్, నేవీ విభాగంలో సబ్‌ లెఫ్ట్‌నెంట్, ఎయిర్‌ఫోర్స్‌ విభాగంలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ కేడర్‌తో కెరీర్‌ ప్రారంభమవుతుంది.


రాత పరీక్షలో విజయం ఇలా
► ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు సిలబస్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. 

► పూర్తిగా కాన్సెప్ట్‌ ఆధారితంగా ఉండే పేపర్‌–1 (మ్యాథమెటిక్స్‌)లో మంచి మార్కుల కోసం అల్జీబ్రా, మ్యాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినెంట్స్, అనలిటికల్‌ జామెట్రీ, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, వెక్టార్‌ అల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంటర్మీడియెట్‌ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రాక్టీస్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు రాయడం మేలు చేస్తుంది. ప్రశ్నలన్నీ కాన్సెప్ట్‌ బేస్డ్‌గా ఉంటాయి. కాబట్టి బేసిక్స్‌పై స్పష్టత, ఫార్ములాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 

► పేపర్‌–2 జనరల్‌ ఎబిలిటీలో రాణించేందుకు బేసిక్‌ ఇంగ్లిష్, గ్రామర్, వొకాబ్యులరీ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. 

► జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి..ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్‌ సైన్స్, చరిత్ర–భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌లపై అవగాహన చేసుకోవాలి. పాత ప్రశ్న పత్రాలు, ఆయా విభాగాలకు ఇచ్చిన వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి.

► ఫిజిక్స్‌లో ఎలక్ట్రోమాగ్నటిజం, మెకానిక్స్, డైనమిక్స్‌లోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

► కెమిస్ట్రీలో కెమికల్‌ అనాలసిస్,ఇనార్గానిక్‌ కాంపౌండ్స్, పిరియాడిక్‌ టేబుల్స్, కాన్సెప్ట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఈక్విలిబ్రియమ్, థర్మోడైనమిక్స్, క్వాంటమ్‌ మెకానిక్స్‌పై ప్రధానంగా దృష్టిసారించాలి. 

► జనరల్‌ సైన్స్‌లో వ్యాధులు–కారకాలు, ప్లాంట్‌ అనాటమీ, మార్ఫాలజీ, యానిమల్‌ కింగ్‌ డమ్‌లను చదవాలి. 

► కరెంట్‌ అఫైర్స్‌ కోసం పరీక్ష తేదీకి ముందు ఆరు నెలల వ్యవధిలో జరిగిన సమకాలీన పరిణామాలపై దృష్టి సారించాలి. 

► హిస్టరీ విభాగాలకు సంబంధించి.. స్వాతంత్రోద్యమ సంఘటనలు, రాజులు–రాజ్య వంశాలు, చారిత్రక కట్టడాలు, యుద్ధాల సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి.

► జాగ్రఫీ విషయంలో ప్రకృతి వనరులు, విపత్తులు, నదులు, పర్వతాలు, పర్యావరణం వంటి అంశాల్లో పట్టు సాధించడం మేలు చేస్తుంది. 

► ఎన్‌డీఏ రాత పరీక్షలో అడుగుతున్న ప్రశ్నలన్నీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే ఉంటున్నాయి. కాబట్టి ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.


ముఖ్య సమాచారం

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ:జూన్‌ 29, 2021
► ఆన్‌లైన్‌ దరఖాస్తు ఉపసంహరణ: జులై 6 నుంచి జులై 12 వరకు
► ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 5, 2021
► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
► వెబ్‌సైట్‌: www.upsc.gov.in

మరిన్ని వార్తలు