టీనా దాబీ మార్క్‌షీట్ వైరల్‌.. రెండు సబ్జెక్టుల్లో 100 మార్కులు.. నిజమేనా?

23 Sep, 2022 18:08 IST|Sakshi

యూపీఎస్‌సీ టాపర్, ఐఏఎస్ అధికారి టీనా దాబీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె సీబీఎస్‌ఈ 12వ తరగతి మార్క్‌షీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం టీనాకు హిస్టరీ, పాలిటికల్ సైన్స్‌లో 100కు 100 మార్కులు వచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి.  అయితే ఈ మార్క్‌షీట్‌ నిజంగా టీనాదేనా అనే విషయంపై క్లారిటీ లేదు. ఆమెకు రెండు సబ్జెక్టుల్లో 100 మార్కులు రావడాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. అసలు టీనా మార్క్‌షీట్ నెట్టింట్లో లేదని తెలుస్తోంది.

అయితే టీనా 2011 సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 93శాతం మార్కులు సాధించినట్లు సమాచారం. ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్లో చదివిన ఆమె.. టాపర్‌గా నిలిచింది. ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరాం కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేసింది. తన ప్రతిభకు గానూ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌' అవార్డు కూడా అందుకుంది. 2015 యూపీఎస్‌సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తోంది.

తరచూ వార్తల్లో
టీనా సివిల్స్‌లో టాపర్ అయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తోంది. 22 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన దళిత యువతిగా అరుదైన ఘనత సాధించింది. అయితే సివిల్స్‌ రెండో ర్యాంకర్‌ అయిన అథర్‌ అమీర్‌ ఖాన్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు 2016లో సోషల్‌ మీడియాలో ప్రకటించడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా వెనక్కి తగ్గకుండా 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్‌ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత డాక్టర్ ప్రదీప్ గవాండేను(2013 ఐఏఎస్‌ బ్యాచ్)ను రెండో వివాహం చేసుకుంది టీనా. దాదాపు ఏడాదిపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట పెళ్లి 2022లో జరిగింది. ఇది కూడా ప్రేమ వివాహమే కావడం గమనార్హం.
చదవండి: జర భద్రం..! ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక

మరిన్ని వార్తలు