‘అమెరికా మీడియా ప్రశంసిస్తే.. ఇక్కడ సీబీఐ దాడులు చేయిస్తున్నారు’

19 Aug, 2022 12:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాపై జరుగుతున్న సీబీఐ దాడులు గురించి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు.  ఢిల్లీలోని విద్యా విధానంపై అమెరికాలోని ప్రఖ్యాత వార్తా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ మనీష్‌ సిసోడియాను ప్రశంసలతో ముంచెత్తుతూ ఫ్రంట్‌ పేజీలో ఆర్టికల్‌ రాస్తే,  అలాంటి వ్యక్తిని మన కేంద్ర ప్రభుత్వం సీబీఐ దాడులతో సత్కరిస్తోందంటూ ఎద్దేవా చేశారు.

సీబీఐ దర్యాప్తు సంస్థ శుక్రవారం ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్‌ సిసోడియా నివాసంతో సహా సుమారు 10 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. అయినా తాము సీబీఐని స్వాగతిస్తామని, తాము నిజాయితీపరులమని కేజ్రీవాల్‌ అన్నారు. తాము లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామని, ఇలాంటి మంచి పనులు చేసేవారిని వేధించడం దురదృష్టకరం అని ఆవేదనగా అన్నారు. బహుశా అందుకేనేమో మన దేశం ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా మారలేదు అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

వాస్తవానికి గతనెలలో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఎక్సూక్యూజ్‌ పాలసీ 2021-22 అమలులో అవతవకలపై సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఐతే ఆయన మనీష్‌ సిసోడియా కూడా ఈ పాలసీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ... సీబీఐతో విచారణ జరిచాలంటూ డిమాండ్‌ చేశారు. మరోవైపు ఢిల్లీ సీఎం గతంలో కూడా సీబీఐ దాడులు జరిగాయని అప్పుడు కూడా ఏమీ కనుగొనబడలేదని చెప్పారు. అంతేగాదు తనపై కూడా చాలా కేసులు నమోదయ్యాయని, వాటిలో ఏది నిజం అని తేలలేదు కాబట్టి ఇప్పుడూ కూడా ఏం జరగదని ధీమాగా అన్నారు.

(చదవండి: కేజ్రీవాల్ ఎఫెక్ట్‌.. డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్‌)

మరిన్ని వార్తలు