CT Scan సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యం: నవ్వుతూ వెళ్లి.. శవమై వచ్చాడు

20 Dec, 2021 15:47 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న దారుణం 

లక్నో: సీటీ స్కాన్‌ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. యూపీ ధనౌలి ప్రాంతానికి చెందిన వినోద్‌ అనే వ్యక్తి కుమారుడు దివ్యాంష్‌(3) నాలుగు రోజుల క్రితం ఇంటి మేడ మీద ఆడుకుంటూ.. కింద పడిపోయాడు. ఈ క్రమంలో చిన్నారిని నామ్నిర్‌ ఎస్‌ఆర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దివ్యాంష్‌ను పరీక్షించిన వైద్యులు.. చిన్నారికి సీటీ స్కాన్‌ చేయించాలని సూచించారు. ఈ క్రమంలో దివ్యాంష్‌ తల్లిదండ్రులు బాలుడిని సుభాష్‌ పార్క్‌ ప్రాంతంలో ఉన్న అగర్వాల్‌ సీటీ స్కానింగ్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. 

సీటీ స్కాన్‌ చేయడానికి ముందు దివ్యాంష్‌కు ఇంజక్షన్‌ ఇచ్చారు. అనంతరం చిన్నారికి స్కాన్‌ చేశారు. అప్పటి వరకు బాగానే ఉన్న దివ్యాంష్‌.. స్కాన్‌ అనంతరం మృత్యువాత పడ్డాడు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు దివ్యాంష్‌ మృతి చెందాడని తెలిపారు. సీటీ స్కాన్‌ సెంటర్‌లోనే ఏదో తేడా జరిగిందని.. దివ్యాంష్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. జరిగిన విషయం గురించి బంధువులకు సమాచారం ఇచ్చారు. 
(చదవండి: అలర్ట్‌: సీటీ స్కాన్‌తో క్యాన్సర్‌ వచ్చే అవకాశం..)

అనంతరం చిన్నారి మృతదేహంతో సీటీ స్కాన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లగా.. అప్పటికే దానికి తాళం వేసి ఉంది. ఈ క్రమంలో చిన్నారి మృతదేహంతో సీటీ స్కాన్‌ సెంటర్‌ బయట కూర్చుని ఆందోళన చేపట్టారు దివ్యాంష్‌ బంధువులు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. అగర్వాల్‌ సీటీ స్కాన్‌ సెంటర్‌ నిర్వహకులు, సిబ్బంది మీద కేసు నమోదు చేశారు. 

చదవండి: యూపీ+యోగి = ఉపయోగి.. సీఎంపై ప్రధాని చమత్కారాలు !

మరిన్ని వార్తలు