యూపీలో ‘కప్పా​’ వేరియంట్‌ కలకలం, ఒకరు మృతి

9 Jul, 2021 15:53 IST|Sakshi

సాక్షి, లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో కప్పా వేరియంట్‌ కలకలం రేపుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఆందోళన రేపిన ఆందోళన ఇంకా సమసిపోకముందే యూపీలో  కరోనా కొత్త వేరియంట్‌ ‘కప్పా’  పాజిటివ్‌ నిర్ణారణ అయిన  66 ఏళ్ల  వ్యక్తి మృతి చెందారు.  ఇతడిని సంత్‌ కబీర్‌ నగర్‌ జిల్లా నివాసిగా అధికారులు గుర్తించారు.

జూన్ 13 న రొటీన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలో భాగంగా సేకరించిన నమూనాలో దీన్ని గుర్తించారు. అనంతరం వీటి  జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ కి పంపించారు. మే 27 న కోవిడ్ -19 కు పాజిటివ్  నిర్ధారణ కాగా, జూన్ 12 న గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ  మెడికల్ కాలేజీకి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ జూన్ 14న కన్నుమూశాడని  కాలేజీ మైక్రోబయాలజీ విభాగం అధిపతి అమ్రేష్ సింగ్ ధ్రువీకరించారు.

అంతకుముందు  యూపీలో  రెండు డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులను గుర్తించగా,  ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కాగా రాష్ట్రంలో గురువారం (జూలై 8) నాటి గణాంకాల ప్రకారం  112 కొత్త కేసులతో మొత్తం సంఖ్య  17,07,044 కి చేరింది. 10 మరణాలతో ఈ సంఖ్య 22,676 కు చేరుకుంది. కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 50కిపైగా డెల్టా ప్లస్‌ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇపుడిక కప్పా వేరియంట్‌ ఉనికి ఆందోళన  రేపుతోంది.

మరిన్ని వార్తలు