ఉత్తరాఖండ్‌లో ఇలా చేస్తే.. 5 వేలు ఫైన్‌ కట్టాల్సిందే

29 May, 2021 18:50 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ధ్వని కాలుష్యం నివారణ కోసం క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. ఇక మీదట అతిగా హారన్‌ మోగించే వాహనదారులపై భారీగా జ‌రిమానాలను విధించనున్నట్లు తెలిపింది. ఈ మేర‌కు శుక్ర‌వారం ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేఫథ్యంలో మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల్లో, పెళ్లి వేడుక‌ల్లో, వాహ‌నాల వ‌ల్ల శ‌బ్ధ కాలుష్యం వెలువడితే భారీ జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. కేంద్ర ప్ర‌భుత్వ శ‌బ్ధ కాలుష్య నియంత్ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, నిర్దేశిత డెసిబుల్ దాటి శ‌బ్ధం వ‌స్తే ఫైన్‌ కట్టాల్సిందేనని ప్ర‌భుత్వ ప్ర‌తినిధి సుబోధ్ ఉనియల్ తెలిపారు.

కొత్తగా సూచించిన ఉత్తరాఖండ్ శబ్థ కాలుష్య నిబంధనల ప్రకారం కొన్ని ప్రాంతాలను గుర్తించారు. మతపరమైన ప్రదేశాలలో, అతిగా ధ్వని మొదటిసారిగా పేర్కొన్న డెసిబెల్‌ను మించితే.. జరిమానా 5000 రూపాయలు, రెండవసారి-10,000 రూపాయలు, మూడోసారి 15,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా హోటళ్ళు, రెస్టారెంట్ల ప్రాంతాలలో మొదటిసారి రూ.10,000, రెండవసారి రూ.15,000, మూడవసారి రూ. 20,000 ఉంటుంది. పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాలలో జరిమానా రూ. 20,000, రెండవ సారి రూ. 30,000, మూడవ సారి రూ. 40,000 వసూలు చేయనున్నట్లు తెలిపారు.

ఈ ప్రాంతంలో శబ్థ కాలుష్య నియమాలను ఉల్లంఘించివారిపై ప్రభుత్వం ఇకపై వెయ్యి రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు జరిమానాలు వసూలు చేయనుంది. ప్రభుత్వ ప్రతినిధి సుబోధ్ ఉనియల్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ పర్యావరణం, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోనుందని తెలిపారు. అదే క్రమంలో శ‌బ్ధ కాలుష్యానికి కార‌ణ‌మైన ప‌రిక‌రాల‌ను కూడా సీజ్ చేయ‌నున్నట్లు తెలిపారు. 

చదవండి: వైరల్‌: ఏం ఫిలాస‌ఫీ బాబు.. మ‌ద్యం తాగితే క‌రోనా సోక‌దా?

మరిన్ని వార్తలు