Karnataka CM: కేటీఆర్‌ ట్వీట్‌ హాస్యాస్పదం.. కర్ణాటక సీఎం కౌంటర్‌

6 Apr, 2022 09:11 IST|Sakshi

బెంగ‌ళూరు: ప‌రిశ్ర‌మ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల  ఖాతాబుక్ సీఈఓ ర‌వీష్ న‌రేశ్ చేసిన ఆవేద‌నా భ‌రిత ట్వీట్ కు తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. సిలికాన్ వ్యాలీ(బెంగళూరు)లో అసౌక‌ర్యంగా ఉంటే తెలంగాణకు వచ్చేయాలని ఆహ్వానించడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో..  

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన ట్వీట్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. అద్భుత‌మైన మౌలిక వ‌స‌తుల‌తో పాటు సామాజికంగానూ మెరుగైన ప‌రిస్థితులు హైదరాబాద్ సొంతమ‌ని తెలిపారు. రాక‌పోక‌ల‌కు ఈజీగా ఉండేలా ఎయిర్‌పోర్టు కూడా హైద‌రాబాద్ సొంత‌మ‌ని కూడా కేటీఆర్ తెలిపారు. ఇక త‌మ ప్ర‌భుత్వం ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత వృద్ధి అనే మూడు అంశాల ప్రాతిప‌దిక‌గా సాగుతోంద‌ని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అయితే.. కేటీఆర్‌ ట్వీట్ హాస్యాస్పదమన్నారు సీఎం బవసరాజ్‌ బొమ్మై. 

ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది బెంగళూరు తరలివచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తుంటారని అన్నారు. స్టార్టప్‌లు, యూనికార్న్ సంస్థలు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న నగరం బెంగళూరేనని గుర్తు చేశారు. మూడేళ్లుగా రాష్ట్రం ఎంతో ఆర్థిక ప్రగతి సాధిస్తోందని అన్నారు. మరోవైపు, కర్ణాటక బీజేపీ కూడా కేటీఆర్ ట్వీట్‌పై స్పందించింది.

తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలుసని, ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళాన్ని కొలవడం నేర్చుకోవాలంటూ ఘాటుగా ట్వీట్ చేసింది. మన పళ్లెంలో ఈగ పడినా పట్టించుకోని వారు పక్క వారి పళ్లెంలో పడిన ఈగ గురించి మాట్లాడడం సహజమని ఎద్దేవా చేసింది. ఉనికి కోల్పోతున్న కేసీఆర్ సర్కారు అభివృద్ధి విషయంలో బెంగళూరుతో సవాలు చేయడం హాస్యాస్పదమని పేర్కొంది.

మరిన్ని వార్తలు