రాహుల్‌ గాంధీనే స్వయంగా పర్యటన రద్దు చేసుకున్నారు

14 Feb, 2023 15:04 IST|Sakshi

సాక్షి, లక్నో: రాహుల్‌ గాంధీ ప్రయాణంపై ఆకస్మిక రద్దుపై కాంగ్రెస్‌ రాజకీయ విమర్శకు దిగింది. సోమవారం అర్థరాత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి విమానాశ్రయం(యూపీ)లో షెడ్యూల్‌ ప్రకారం విమానం ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. ఐతే అనుహ్యంగా చివరి నిమిషంలో అది కాస్త క్యాన్సిల్‌ అయ్యింది. దీంతో అధికారుల ఒత్తిడికి తలొగ్గి ల్యాండింగ్‌ చేసేందుకు ఎయిర్‌పోర్ట్‌​ అధికారులు నిరాకరించారంటూ ఆరోపణలు చేసింది కాంగ్రెస్‌.

దీనికి వారణాసి ఎయిర్‌పోర్ట్‌ స్పందిస్తూ..రాహుల్‌ గాంధీనే స్వయంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారని తెలిపింది. కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను ఖండించింది. దయచేసి మీ వ్యాఖ్యలను సరిదిద్దుకోండి అంటూ చురకలంటించింది. రాహుల్‌ ఎయిర్‌పోర్ట్‌కి తన పర్యటన రద్దు గురించి తెలియజేస్తూ ఈమెయిల్‌ పంపినట్లు కూడా పేర్కొంది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌ రాయ్‌ వాయనాడ్‌ నుంచి తిరిగి రాగానే విమానాశ్రయంలో రాహుల్‌ విమానం ల్యాండ్‌ కావాల్సి ఉందంటూ ఆరోపణలు చేయడం ప్రారంభించారు. అధికారుల ఒత్తిడికిలోనై అనుమతి ఇవ్వలేదని, పైగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనను సాకుగా ఉపయోగించుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. అంతేగాదు తమ పార్టీ నాయకులు రాహుల్‌ని రిసీవ్‌ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్‌ చేస్తున్నామని, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించినట్లు చెప్పుకొచ్చారు రాయ్‌.

అంతేగాదు రాహుల్‌ గాంధీని చూసి బీజేపీ భయపడుతోందని, అందుకనే వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ల్యాండ్‌ చేసేందుకు నిరాకరించిందని అన్నారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ప్రధానిలో ఆందోళన మొదలైందని, అందుకనే రాహుల్‌ని ఆయన ఇలా ఇబ్బంది పెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. వాస్తవానికి రాహుల్‌ మంగళవారం కమల నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించాల్సి ఉందని రాయ్ తెలిపారు.

(చదవండి: జస్ట్‌ కారు దిగి వచ్చింది.. దొరికింది ఛాన్స్‌ అంటూ పులి అమాంతం..)

>
మరిన్ని వార్తలు