తమిళనాడులో ట్విస్ట్‌.. జయలలిత సోదరుడినంటూ కోర్టులో పిటిషన్‌

10 Jul, 2022 18:11 IST|Sakshi

తమిళనాడులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయం మరోసారి కోర్టుకు చేరింది. కర్నాకటకు చెందిన ఓ వ్యక్తి తాను జయలలితకు సోదరుడిని అని చెబుతూ కోర్టును ఆశ్రయించాడు. ఆమె ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు.

వివరాల ప్రకారం.. మైసూరులోని వ్యాసపురానికి చెందిన వాసుదేవన్ (83) తాను దివంగత తమిళనాడు సీఎం జయలతితకు సోదరుడినని చెప్పాడు. ఈ సందర్బంగా వాసుదేవన్‌ మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత తండ్రి జయరామ్​ మొదటి భార్య జయమ్మ కుమారుడిని తానేని పేర్కొన్నాడు. తర్వాత, జయరామ్​.. వేదమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారని అన్నారు. వారికి పుట్టిన వారే జయలలిత, జయకుమార్ అని తెలిపాడు.
తన తల్లి జయమ్మ.. 1950లో మైసూరు కోర్టులో భరణం కోసం కేసు వేశారని గుర్తు చేశాడు. ఆ కేసులో మా నాన్న రెండో భార్య వేదమ్మ, జయకుమార్, జయలలితను ప్రతివాదులుగా చేర్చామని స్పష్టం చేశాడు.

కానీ, జయలలిత కంటే ముందే జయకుమార్ మరణించారని వెల్లడించారు. ఈ క్రమంలో జయలలితకు సోదరుడిగా, వారసుడిగా ఉన్న తనకు కూడా ఆస్తిలో వాటా కావాలని డిమాండ్‌ చేశాడు. మరోవైపు.. 2020లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులో జయలలిత వారసులుగా దీపక్​, దీప మాత్రమే అంటూ తీర్పునిచ్చింది. తాజాగా దీపక్‌, దీప పేరుతో పాటుగా తన పేరును కూడా చేర్చి తీర్పును సవరించాలని వాసుదేవన్‌ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. 
 

మరిన్ని వార్తలు