వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడెమీ అవార్డు

13 Mar, 2021 05:58 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సాహితీవేత్త వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 2020 సంవత్సరానికి గానూ సాహిత్య అకాడెమీ అవార్డులను వార్షిక ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌’ సందర్భంగా శుక్రవారం ప్రకటించారు. మొయిలీ సహా 20 మందికి ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. వీరప్ప మొయిలీకి ఆయన కన్నడ భాషలో రాసిన దీర్ఘ కవిత ‘శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం’కు, కవయిత్రి అరుంధతి సుబ్రమణియన్‌కు ఇంగ్లిష్‌లో ఆమె రాసిన కవితల సంకలనం ‘వెన్‌ గాడ్‌ ఈజ్‌ ఎ ట్రావెలర్‌’కు ఈ పురస్కారం లభించింది. ఏడు కవితా సంకలనాలు, నాలుగు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒక దీర్ఘ కవిత, ఒక మెమొయిర్‌కు ఈ పురస్కారం లభించింది.

మలయాళం, నేపాలీ, ఒడియా, రాజస్తానీ భాషల్లోని సాహిత్యాలకు త్వరలో ఈ అవార్డులను ప్రకటిస్తామని అకాడెమీ వెల్లడించింది. మొయిలీ, అరుంధతి కాకుండా, ఇమాయియం(తమిళం), అనామిక(హిందీ), ఆర్‌ఎస్‌ భాస్కర్‌(కొంకణి), హరీశ్‌ మీనాక్షి(గుజరాతీ), ఇరుంగ్బమ్‌ దేవన్‌(మణిపుర్‌), రూప్‌ చంద్‌ హన్స్‌దా(సంతాలి), నందకిషోర్‌(మరాఠీ), మహేశ్‌చంద్ర గౌతమ్‌(సంస్కృతం), హుస్సేన్‌ ఉల్‌ హక్‌(ఉర్దూ), అపూర్వ కుమార్‌సైకియా(అస్సామీ), దివంగత హిదయ్‌ కౌల్‌ భారతి(కశ్మీరీ), ధరనింధర్‌ ఓవరి(బోడో) తదితరులకు ఈ పురస్కారం లభించింది. పురస్కారం కింద రూ. లక్ష నగదు లభిస్తుంది. అవార్డుల ప్రదానోత్సవ తేదీని త్వరలో వెల్లడించనున్నారు.

మరిన్ని వార్తలు