సాక్షి, ముంబై: నిన్నమొన్నటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు తదితర వస్తువులు లభించిన రేషన్ షాపుల్లో ఇక నుంచి కూరగాయలు, పండ్లు కూడా లభించనున్నాయి. రేషన్ షాపుకు వచ్చిన కార్డుదారులు పండ్లు, కూరగాయలు కూడా చౌక ధరలతో కొనుగోలు చేయవచ్చు. గతంలో పుణేలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయగా, ప్రస్తుతం ముంబై, థాణేలోనూ దీన్ని అమలు చేస్తున్నారు. ఆ తరువాత కొనుగోలుదారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా నగరాల్లోకి ఈ పథకాన్ని విస్తరించనున్నారు.
ఆహార, పౌర సరఫరాల శాఖ రేషన్ షాపుల్లో చౌక ధరకే పండ్లు, కూరగాయలు విక్రయించడానికి ఆరు నెలలపాటు రైతులు, ఉత్పత్తి కంపెనీలకు కొన్ని షరతులతో అనుమతినిచ్చింది. రేషన్ షాపుల్లో కార్డుదారులకు పప్పు దినుసులు, బియ్యం, గోధుమలు, చక్కెర ఇతర సరుకులతోపాటు పండ్లు, కూరగాయలు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల కిందట నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేసింది.