సీనియర్‌ జర్నలిస్టు కన్నుమూత : సంతాప సందేశాల వెల్లువ

26 Mar, 2021 11:40 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: సుప్రసిద్ధ జర్నలిస్ట్, ఎడిటర్‌, రచయిత అనిల్ ధార్కర్ కన్నుమూశారు. గుండెజబ్బుతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుది శ్వాస  విడిచారు. ధార్కర్‌ మృతిపై పలువురు జర్నలిస్టు ప్రముఖులు, ఇతర ముఖ్యలు తీవ్ర విచారం ‍వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఆర్‌ఐపీ అనిల్ ధార్కర్ అంటూ సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. పత్రికా,సాహిత్య ప్రపంచానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు.

ముంబై ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అండ్ లిటరేచర్ లైవ్ వ్యవస్థాపకుడు అనిల్ ధార్కర్.  ఐదు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ కరియర్‌లో కాలమిస్ట్‌గా, రచయితగా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సలహా కమిటీ సభ్యుడిగా ఇలా అనేక బాధ్యతల్లో పనిచేశారు. మిడ్-డే, ది ఇండిపెండెంట్‌తో సహా పలు పత్రికలకు ఆయన సంపాదకుడిగా పనిచేశారు. అలాగే దక్షిణ ముంబైలోని ఆకాశవాణి ఆడిటోరియంను ఆర్ట్ మూవీ థియేటర్‌గా రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ది రొమాన్స్ ఆఫ్ సాల్ట్ రచయిత అయిన ధార్కర్ రచనలు దేశ విదేశాల్లో  ప్రాచుర్యం పొందాయి.  

మరిన్ని వార్తలు