‘రజా అకాడమీ’ని నిషేధించాలి

15 Nov, 2021 04:58 IST|Sakshi

వీహెచ్‌పీ డిమాండ్‌

నాగపూర్‌/పుణే: మహారాష్ట్రలోని పలు నగరాలు, పట్టణాల్లో హింసాకాండ చోటుచేసుకోవడంపై విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపురలో జరిగిన మత కలహాలను నిరసిస్తూ ఇస్లామిక్‌ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ ఘటనలను వీహెచ్‌పీ జనరల్‌ సెక్రెటరీ మిలింద్‌ పరాండే ఆదివారం ఖండించారు.

అల్లర్లకు కారణమైన ‘రజా అకాడమీ’ అనే ఇస్లామిక్‌ సంఘాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అల్లరి మూకలపై తాము పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశామని అన్నారు. రాళ్లు రువ్వినవారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒకవేళ పోలీసులు స్పందించకపోతే తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో త్వరలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీని కలుస్తామన్నారు. అల్లర్లలో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించా లని మహారాష్ట్ర సర్కార్‌కి మిలింద్‌ పరాండే విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వ్యాఖ్యలపైనా ఆయన మాట్లాడారు. భారత్‌ 2014లో సాంస్కృతిక స్వాతంత్య్రం పొందిందని చెప్పారు. 

మరిన్ని వార్తలు