మీరు ఏం మాట్లాడుకునేది ‘పెద్దన్న’ వింటూనే ఉంటారు.. మార్గరేట్ ఆళ్వా సంచలన ఆరోపణలు

26 Jul, 2022 20:12 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని అన్నారు. బీజేపీలోని తన మిత్రులతో ఫోన్‌లో మాట్లాడాక తన కాల్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారో ‘పెద్దన్న’ వింటూనే ఉంటారన్నారు. కలిసినప్పుడు కూడా నాయకులు గుసగుసలాడాల్సిన పరిస్థితి నెలకొందని ఆక్షేపించారు. భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్‌ (ఎంటీఎన్ఎల్) పంపిన నోటీసును మార్గరెట్ ఆళ్వా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

అయితే మార్గరెట్‌ ఆళ్వా ఆరోపణలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. ఆమె ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించారు. ఆళ్వా అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని.. ఓ సీనియర్ నేత అయ్యుండి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.
చదవండి: ఉచితాలు ప్రకటించే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని పిటిషన్‌.. కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు

>
మరిన్ని వార్తలు