ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక

30 Jun, 2022 05:40 IST|Sakshi

అదే రోజు ఫలితాలు వెల్లడి

16వ ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ విడుదల  

సాక్షి, న్యూఢిల్లీ: దేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. తదుపరి ఉపరాష్ట్రపతి ఆగస్టు 6న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌  ప్రకటించారు. ఈ ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ వ్యవహరిస్తారని తెలిపారు.

రాజ్యసభ ఎక్స్‌–అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఉపరాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ప్రస్తుతం పార్లమెంట్‌ ఉభయసభల్లో కలిపి 788 మంది సభ్యులున్నారని ఈసీ వెల్లడించింది. వీరిలో 233 మంది రాజ్యసభ సభ్యులు, 12 మంది రాజ్యసభ నామినేటెడ్‌ సభ్యులు కాగా, 543 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు జూలై 5న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. జూలై 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 20న నామినేషన్లు పరిశీలిస్తారు.

జూలై 22 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికను కేవలం పార్లమెంట్‌ ప్రాంగణంలోనే నిర్వహిస్తారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో పార్టీల బలాబలాలను బట్టి చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే అభ్యర్థి సునాయాసంగా గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికకు 115 నామినేషన్లు
ఈ నెల 18న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికకు ఇప్పటిదాకా 115 నామినేషన్లు దాఖలయ్యాయి.  వీటిలో 28 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసిందని రాజ్యసభ సెక్రటేరియట్‌ వెల్లడించింది. గురువారం నామినేషన్లను పరిశీలిస్తారు. ప్రధాన అభ్యర్థులతోపాటు పలువురు సామాన్యులు కూడా నామినేషన్లు వేశారు.

మరిన్ని వార్తలు