Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌.. ముర్ము కోసం ఆ ఊరిలో పండుగ

21 Jul, 2022 09:38 IST|Sakshi

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌ కోసం సర్వం సిద్ధమైంది. భారత దేశానికి పదిహేనవ రాష్ట్రపతి ఎవరు అవుతారనే సస్పెన్స్‌ మరికొన్ని గంట్లలో వీడిపోతుంది. బరిలో ద్రౌపది ముర్ము, యశ్వంత్‌ సిన్హా ఉండగా.. విజయావకాశాలు ముర్ముకే ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో.. 


దేశవ్యాప్తంగా సంబురాలకు ఎన్డీయే కూటమి సిద్ధమవుతోంది. పలు రాష్ట్రాల్లో విజయోత్సవాలకు బీజేపీ అంతా సిద్ధం చేసింది. తీపి వంటకాలు, ప్రత్యేక నృత్యాల కార్యక్రమాలకు ఏర్పాటు చేసింది కూడా. అయితే ద్రౌపది ముర్ము స్వగ్రామం ఒడిశా రాయ్‌రంగ్‌పూర్‌లో మాత్రం పండుగ వాతావరణం కాస్తంత ఎక్కువే నెలకొంది. 

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం ఖాయమని భావిస్తోంది రాయ్‌రంగ్‌పూర్‌ గ్రామం. అందుకే 20వేలకు పైగా స్పెషల్‌ లడ్డూలు తయారు చేయించారు ఆ ఊరి పెద్దలు. అంతేకాదు.. కోయ డ్యాన్సులతో బాణాసంచాలతో సంబురాలకు సర్వం సిద్ధం చేశారు. 

ఇక ఆమె చదివిన పాఠశాలలో కోలాహలం మామూలుగా లేదు. ఆమె దేశానికి సేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని ఆ స్కూల్‌ మాజీ హెడ్‌ మాస్టర్‌, ముర్ముకు పాఠాలు నేర్పిన బిశ్వేశ్వర్‌ మోహంతి తెలిపారు. తమ స్కూల్‌లో చదివి రాష్ట్రపతి కాబోతున్నందుకు విద్యార్థులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చదువుతామంటూ చెప్తున్నారు వాళ్లలో కొందరు. ద్రౌపది ముర్ము గనుక విజయం సాధిస్తే.. దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా నిలుస్తారు.

ఇదిలా ఉంటే.. జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ జరగ్గా..  ఇవాళ(గురువారం) పార్లమెంట్‌ హౌజ్‌లోని రూం నెంబర్‌ 63లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులు ఇక్కడికి చేరుకున్నాయి. కౌంటింగ్‌ నేపథ్యంలో రూమ్‌ నెంబర్‌ 63ని సైలెంట్‌ జోన్‌గా ప్రకటించారు కూడా.

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు