Viral Video: చిరుతపులి బీభత్సం.. కోర్టు ఆవరణంలోకి ప్రవేశించి, ఆరుగురిపై దాడి

8 Feb, 2023 21:20 IST|Sakshi

లక్నో: కోర్టు కాంప్లెక్స్‌లోకి చొరబడిన ఓ చిరుతపులి స్థానికంగా బీభత్సం సృష్టించింది. కోర్టు అంతా సంచరిస్తూ పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఘజియాబాద్‌ కోర్టులోని మొదటి అంతస్తులోకి బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఓ చిరుతపలి ప్రవేశించింది. 

కోర్టు ప్రాంగణంలో చిరుతపులి కనిపించడంతో భయంతో అక్కడున్న వారంతా అటు ఇటు పరుగులు తీశారు. చిరుత నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొంతమంది లాయర్లు లాయర్లు తమ గదుల్లోకి వెళ్లి లాక్‌ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కోర్టు ఆవరణంలో గందరగోళం నెలకొంది.

చుట్టూ జనాలను చూసి బెంబేలెత్తిన చిరుతపులి మరింత రెచ్చిపోయింది. కర్రల సాయంతో తరిమికొట్టేందుకు వెళ్లిన లాయర్‌పై చిరుతపులిని దాడి చేసింది. అంతేగాక కోర్టు ఆవరణలో చెప్పులు కుట్టే వ్యక్తి, పోలీస్‌ అధికారితో సహా పలువురిపై దాడి చేస్తూ తీవ్రంగా గాయపరిచింది.

చిరుతపులి సంచారంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాలుగు గంటలు శ్రమించిన అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు చిరుతపులిని నెట్‌లో బంధించి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వద్ద చిరుతపులి సంచారం.. న్యాయవాదులను గాయపరిచిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వార్తలు