వైరల్‌ వీడియో.. ఇట్స్‌ బిర్యానీ టైం బ్రో!

30 Sep, 2020 16:51 IST|Sakshi

బెంగళూరు: కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చినప్పుడు చూడాలి జనాలను. షాపులు తెరవక ముందే వెళ్లి క్యూలో నిల్చున్నారు. దాదాపు ప్రతి మద్యం దుకాణం దగ్గర కిలోమీటర్ల మేర వరుసలో నిలబడిన జనాలను చూశాం. ప్రస్తుతం కర్ణాటకలో కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది. కాకపోతే అది మద్యం దుకాణం ముందు కాదు. ఓ రెస్టారెంట్‌ ముందు. అవును బిర్యానీ కోసం జనాలు ఓ హోటల్‌ ముందు కిలోమీటర్‌ మేర క్యూలో నిల్చున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు చూడండి.. తాజాగా కర్ణాటకలో రెస్టారెంట్లు తెరవడానికి అనుమతించారు. ఈ క్రమంలో బెంగళూరుకు సమీపంలోని హోస్కోట్‌లోని ఆనంద్‌ రెస్టారెంట్‌ దమ్‌ బిర్యానీకి ప్రసిద్ధి చెందింది. (చదవండి: లాక్‌డౌన్‌లోనూ భలే లాగించేశారు..!)

ఈ నేపథ్యంలో ఆదివారం రెస్టారెంట్‌ తెరుస్తున్నారనే సమాచారంతో బిర్యానీ ప్రియులు ఇలా హోటల్‌ వద్దకు చేరుకున్నారు. దాదాపు 1.5కిలోమీటరు పొడవున వందలాది మంది కస్టమర్లు రెస్టారెంట్‌ బయట క్యూ కట్టారు. దీన్ని కాస్త ఓ ట్విట్టర్‌ యూజర్ వీడియో తీసి షేర్‌ చేశారు‌. ‘ఇది ఏ బిర్యానీ.. ఉచితంగా ఇస్తున్నారా ఏంటి’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘మద్యం దుకాణాల ముందు మాత్రమే ఇంత భారీ క్యూలు చూశాం.. బిర్యానీనా మజాకా’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

మరిన్ని వార్తలు