కార్పెట్‌పై తారు రోడ్డు.. చేత్తో ఎత్తిన గ్రామస్తులు.. దెబ్బకు అట్టముక్కలా లేచొచ్చింది

1 Jun, 2023 12:34 IST|Sakshi

మహారాష్ట్రలో వింత ఘటన చోటుచేసుకుంది. తారు రోడ్డును కొంతమంది వ్యక్తులు ఒట్టి చేతులతో అమాంతం ఎత్తేశారు. కొత్తగా వేసిన రోడ్డు అట్టముక్కలా పైకి రావడం విచిత్రంగా మారింది. ఈ విషయాన్ని గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్‌ అయ్యింది. జల్నా జిల్లాలోని అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖారీలో ఈ సంఘటన జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎం రూరల్ రోడ్ స్కీమ్) కింద ఈ రహదారిని నిర్మించారు.

అయితే రోడ్డు మీద కార్పెట్‌ను బేస్‌లాగా పరిచి దానిపై తారు రోడ్డు వేశారు. స్థానిక కాంట్రాక్టర్‌ ఈ రహదారిని నిర్మించారు. దీనిని గుర్తించిన గ్రామస్థులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బోగస్‌ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్షానికి ఈ పనులు సాక్ష్యంగా నిలిచాయని మండిపడ్డారు. రోడ్డు వేసి నాలుగు రోజులు అవుతుందని.. ఈ విధంగా లేచిపోయే రోడ్లను గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.రాత్రికి రాత్రి ఇలాంటి రోడ్లు వేసి.. చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. దీనిని ఆమోదించిన ఇంజనీర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అయితే కాంట్రాక్టర్‌ మాటలు మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. రోడ్డు నిర్మాణం కోసం జర్మన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు అతడు పేర్కొన్నాడు. రోడ్డుపై కార్పెట్ వేసి.. దానిపై తారు రోడ్డు నిర్మాణం చేసినట్లు చెబుతున్నాడు. మొత్తానికి ఫేక్‌ రోడ్డుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారత్‌ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అయినా ఇప్పటికీ పలు గ్రామాల్లో సరైన రోడ్లు లేకపోవడం గమనార్హం.
చదవండి: పసిప్రాయంలో రాసిన ఉత్తరం 15 ఏళ్లుగా వెంటాడుతూ...

మరిన్ని వార్తలు