వీడు మనిషేనా.. మానవత్వం లేకుండా కుక్కను కారుకు కట్టి లాక్కెళ్లి..

19 Sep, 2022 09:03 IST|Sakshi

ఆయనో డాక్టర్.. కానీ మానవత్వం మరిచి ఓ మూగజీవాన్ని దారుణంగా హింసించాడు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అతను చేసిన పనికి నెటిజన్లు దుమ్మెతిపోస్తున్నారు. పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

వివరాల ప్రకారం, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ కారు డ్రైవర్‌.. ఓ కుక్కను తన కారుకు కట్టి నడిరోడ్డు మీద లాక్కెళ్లాడు. కారును స్పీడ్‌గా డ్రైవ్‌ చేయడంతో కుక్క వేగంగా పరిగెత్తలేక కిందపడిపోయింది. అయినప్పటికీ అతను మాత్రం కారును ఆపలేదు. కాగా, కారు వెనుక వస్తున్న ఓ బైకర్‌.. కారును అడ్డుకునే పయత్నం చేశాడు. కారుకు బైకును అడ్డంగా పెట్టడంతో డ్రైవర్‌ కారును ఆపాడు. ఈ క్రమంలో అక్కడున్న మరికొంత మంది కారు వద్దకు చేరుకుని కుక్కను విడిపించారు. ఈ ప్రమాదంలో కుక్కకు తీవ్ర గాయాలు కాగా ఆసుప్రతికి తరలించారు.

అనంతరం.. డ్రైవర్‌ను ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించాడు. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టింది డాక్టర్‌ రజనీష్‌ గ్వాలాగా గుర్తించారు. దీంతో, ఈ ఘటనపై కొందరు వ్యక్తులు పోలీసులు, ఎన్జీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఎన్జీవోల ఫిర్యాదు మేరకు పోలీసులు జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. డాక్టర్‌కు కనికరం లేదని, మానవత్వం అంటే తెలియదని కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు