దీపావళి దందా.. ప్రతి ఏడాది ఇంతే!

16 Oct, 2022 20:02 IST|Sakshi

సాక్షి, చెన్నై: దీపావళి వేళ అధికారులు, సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. దీంతో 46 ప్రభుత్వ విభాగాలపై విజిలెన్స్‌ అవినీతి నిరోధక విభాగం దృష్టి సారించింది. వివరాలు.. దీపావళి వస్తోందంటే చాలు కొన్ని శాఖల్లో చందాలు, మామూళ్ల పేరిట జరిగే దందా తారస్థాయిని చేరుతుంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్లు, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, పరిశ్రమలు, రవాణా, రహదారులు, అటవీ, వాణిజ్యం, అగ్నిమాపకం, పర్యావరణం, పౌర సరఫరాలు. ఎక్సైజ్, వ్యవసాయం విభాగాల్లో  వసూళ్లు జోరందుకున్నాయి.  ఈ సమాచారంతో విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ అధికారుల శుక్ర, శనివారం ఆయా కార్యాలయాల్లో దాడులు చేపట్టారు.  

రూ. రెండు కోట్ల మేరకు నగదు లభ్యం 
సోదాల్లో అత్యధికంగా తిరువారూర్‌ డివిజన్‌ ఇంజినీరింగ్‌ గెస్టుహౌస్‌లో రూ. 75 లక్షలు పట్టుబడింది. అలాగే, నామక్కల్‌ రహదారుల శాఖ కార్యాలయంలో రూ. 8.77 లక్షలు, విరుదానగర్‌ గ్రామీణాభివృద్ధి అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో రూ. 12.53 లక్షలు, కళ్లకురిచ్చి వ్యవసాయ కార్యాలయంలో రూ.4.26 లక్షలు, తిరునల్వేలి రహదారుల విభాగంలో రూ.3.55 లక్షలు, కృష్ణగిరి చెక్‌ పోస్టులో రూ.  2.20 లక్షల, తిరువణ్ణామలై బీడీఓ కార్యాలయంలో రూ. 1.31 లక్షలు, నాగపట్నం బీడీఓ కార్యాలయంలో రూ.1.19 లక్షలు, తిరుపత్తూరు ఎక్స్‌జ్‌ కార్యాలయంలో రూ. 1.01 లక్షలు పట్టుబడ్డాయి. మదురై, శివగంగై, కోవై, కరూర్, సేలం, పుదుకోట్టై, ధర్మపురి, చెంగల్పట్టు తదితర జిల్లాలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. డెల్టా జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిపిన సోదాలలో రూ. 78 లక్షలు పట్టుబడింది.

చదవండి: అన్నదమ్ములతో మహిళ వివాహేతర సంబంధం.. రెండు సార్లు పారిపోయి..

మరిన్ని వార్తలు