ఇదేం విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి.. ఎలాగంటే

1 Aug, 2022 10:28 IST|Sakshi

పరీక్షల్లో మంచి మార్కులు రావాలని విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు. పాస్‌ అయితే చాలురా బాబు అని కొందరనుకుంటే.. ఇక టాపర్స్‌ బ్యాచ్‌ ఏమో వందకు 99 మార్కులు తెచ్చుకోవాలని రోజుకీ గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపడుతుంటారు. అయితే ఎంత చదివినా, ఎంత రాసినా మహా అయితే 99, లేదా వంద మార్కులు సాధించవచ్చు. అంతకుమించి అయితే రావు కదా. కానీ బిహార్‌కు చెందిన ఓ డిగ్రీ విద్యార్థికి 100కు 151 మార్కులు వచ్చాయి. హా అదేంటి అని ఆశ్యర్చపోతున్నారా.. నిజమేనండి.. ముందుగా తన మార్కులను చూసుకున్న విద్యార్థి కూడా మీలాగే బిత్తరపోయాడు. చివరికి అసలు తెలిసి ఖంగుతిన్నాడు.

అసలేం జరిగిందంటే.. దర్బంగా జిల్లాకు  చెందిన లలిత్ నారాయణ మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం (బీఏ ఆనర్స్‌)  చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులో 100కు 151 మార్కులు వచ్చాయి. రిజల్ట్స్‌ను చూసి షాక్‌ అయినట్లు విద్యార్థి తెలిపారు. తను మాట్లాడుతూ.. మార్కులు చూసి ఆశ్చర్యపోయానని ఇది తాత్కాలిక మార్కు షీట్ అయినప్పటికీ, ఫలితాలు విడుదల చేయడానికి ముందు అధికారులు దానిని తనిఖీ చేయాలి కదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
చదవండి: కర్ణాటక: తేనె రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు 

ఇదిలా ఉండగా బీకామ్‌ చదవుతున్న మరో విద్యార్థికి అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ పేపర్‌లో సున్నా మార్కులు వచ్చాయి. అయినా అతన్ని తదుపరి క్లాస్‌కు ప్రమోట్‌ చేశారు. కాగా మార్కుల విషయంపై యూనివర్సిటీ స్పందించింది. టైపింగ్‌ మిస్టేక్‌ కారణంగా ఇద్దరికి మార్కులు తప్పుగా పడ్డాయని పొరపాటు జరిగినట్లు తెలిపింది. రెండు మార్క్‌ షీట్‌లలో పొరపాట్లు జరిగాయని, వాటిని సరిచేసి మళ్లీ కొత్త ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లుజారీ చేసినట్లు చేసినట్లు వివరణ ఇచ్చింది. 
 

మరిన్ని వార్తలు