వైరల్‌: ఇదేం వింత.. 17 ఏళ్ల కుర్రాడికి ఏకంగా 82 పళ్లు..

13 Jul, 2021 13:17 IST|Sakshi

Bihar Man Rare Tumor: సాధారణంగా  మనుషులకు 32 పళ్లు (దంతాలు) ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. వయస్సు తేడాను బట్టి కొందరి దంతాల సంఖ్యలో మార్పులు ఉండవచ్చు. దంత సమస్యలు ఏమైనా ఉంటే కొందరికి అవి ఊడిపోవచ్చు. కానీ ఎప్పుడైనా 32 కంటే ఎక్కువ దంతాలు కలిగిఉన్న వారిని చూశారా. పోనీ వారి గురించి విన్నారా.. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తికి ఉండాల్సిన పళ్ల కంటే మించి ఉన్నాయి. హా ఎన్నిలే 33, 34 ఉండవచ్చనుకుంటున్నారా. కాదండోయ్‌.. దానికి రెట్టింపుగా ఏకంగా 82 పళ్లు ఉన్నాయి. ఈ విచిత్ర సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.

పాట్నాకు చెందిన నితీష్‌ కుమార్‌ అనే 17 ఏళ్ల యువకుడికి 82 దంతాలు ఉన్నాయి. అంటే దాదాపు అతని వయస్సు కంటే దాదాపు అయిదు రెట్లు ఎక్కువ. నితీష్ గత అయిదేళ్లుగా నోటిలో కణితితో బాధపడుతున్నారు. కణితి బాధ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దంతాల డాక్టర్ వద్దకు వెళ్లాడు. అతడికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విషయం తెలిసి షాక్ అయ్యారు. నితీష్ కుమార్ దవడలో 82 పళ్లు ఉన్నాయని, అందువల్లే అతనికి దవడ నొప్పిగా ఉందని తెలిపారు. దవడలో ఏర్పడిన ట్యూమర్​ వల్ల దంతాలన్నీ ఒకే దగ్గర ఎక్కువ మొత్తాల్లో పుట్టుకొచ్చాయని తెలిపారు.

ఇటువంటి దాన్ని వైద్య పరిభాషలో `ఒడొంటొమా` అంటారని పేర్కొన్నారు. దీంతో నితీష్‌కు మూడు గంటలపాటు సుదీర్ఘ ఆపరేషన్​ చేసి దవడంలోని ట్యూమర్​ని తొలగించారు. కణిత రెండు దవడల వైపు ఏర్పడటం వల్ల నితీశ్ కుమార్ ముఖం వికృతంగా కనిపించేదని, ఇప్పుడు సర్జరీ చేయడంతో యువకుడి ముఖం సాధారణ పరిస్థితిలోకి వచ్చిందన్నారు. ఆపరేషన్‌తో అదనపు దంతాలు తొలగించామని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నితీష్ కుమార్ ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు తెలిపారు.

మరిన్ని వార్తలు