కేరళలో దారుణం; కాల్‌ చేస్తామని ఫోన్‌ కొట్టేసి బైక్‌తో ఈడ్చుకెళ్లారు

3 Jul, 2021 15:45 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలోని కోజిగోడ్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఫోన్‌కాల్‌ చేసుకుంటామని చెప్పి మొబైల్‌ఫోన్‌ కొట్టేయడమే కాకుండా అడ్డు వచ్చిన సదరు వ్యక్తిని బైక్‌తో కొద్దిదూరం పాటు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వివరాలు.. బిహార్​కు చెందిన అలీ అక్బర్ కోజిగోడ్‌కు పనినిమిత్తం వచ్చారు. తన పని ముగించుకొని రోడ్డుపై వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు.

తమ ఫోన్‌ పాడైందని.. అర్జెంటుగా ఒక కాల్‌ చేసుకుంటామని చెప్పి అక్బర్‌ను అడిగారు. వారి మాటలు నమ్మిన అక్బర్‌ తన ఫోన్‌ను వారి చేతిలో పెట్టగానే యువకులిద్దరు వెంటనే బైక్‌ను స్టార్ట్‌ చేసి అక్కడినుంచి పారిపోయేందుకు యత్నించారు. అయితే బైకును అక్బర్‌ పట్టుకొని ఉండడంతో అతన్ని అలాగే రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ క్రమంలో అలీతో పాటు బైకుపై వెనకాల కూర్చున్న దొంగ కూడా కిందపడిపోయాడు. ఆ తర్వాత అక్బర్‌ బైకును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్బర్‌ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. కాగా అక్బర్‌ వద్ద ఫోన్‌ దొంగలించిన ఇద్దరు యువకులను సాను కృష్ణన్, షమ్నాస్ అబ్దురాహిమాన్‌లుగా గుర్తించారు. అయితే దుండగులకు చెందిన ఒక ఫోన్ అక్కడ​పడిపోగా స్థానికులు దానిని పోలీసులకు అందించారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వార్తలు