పెళ్లి మండపానికి వరుడు రాలేదని.. ఊహించని షాకిచ్చిన వధువు!

20 Mar, 2023 15:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల పెళ్లి మండపాలలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ వరుడు తన పెళ్లి సంగతిని కూడా మరిచిపోయి మండపానికి వెళ్లలేదు. ఇక వరుడి రాక కోసం వేచి చూసి విసుగుచెందిన వధువు అతనికి ఊహించని షాకిచ్చింది. ఈ వింత ఘటన బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని సుల్తాన్‌గంజ్ గ్రామంలో చోటు చేసుకుంది. 

ఓ వరుడు తన పెళ్లి రోజు ఆనందంతో ఫుల్‌గా మందు తాగి ఆ మత్తులో మండపానికి వెళ్లాలన్న విషయాన్ని మరచి నిద్రపోయాడు. ఇరువర్గాల కుటుంబ సభ్యులు వివాహ వేదిక వద్ద వరుడి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎంత సేపు ఎదురుచూసిన అతను రాలేదు. వివాహం మరుసటి నాడు స్పృహలోకి రావడంతో వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే వరుడు నిర్లక్ష్యపు ధోరణి చూసిన ఆమెకు చిరాకు వచ్చింది. ఈ పెళ్లికి నిరాకరించింది.

తన బాధ్యతలను కూడా సరిగా అర్థం చేసుకోని వ్యక్తితో తన జీవితాన్ని గడపలేనని తెగేసి చెప్పింది. దీంతో వాయిద్యాలు, డీజే సౌండ్‌లు హోరెత్తాల్సిన మండపం కాస్త సైలెంట్‌గా మారిపోయింది. పెళ్లి ఏర్పాట్లకు ఖర్చు చేసిన డబ్బును వరుడి కుటుంబీకులు తిరిగి ఇవ్వాలని వధువు కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వరుడి బంధువులు కొందరిని బందీలుగా చేయడంతో అక్కడి పరిస్థితి విషమించింది. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపులోకి తెచ్చారు.  చివరికి ఈ కేసు సద్దుమణిగినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో.. ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలోని తిర్వా కొత్వాలి ప్రాంతంలో వధువుకు 12వ తరగతి మార్కులు సరిపోవని భావించిన వరుడు తన పెళ్లిని రద్దు చేసుకున్నాడు. 

మరిన్ని వార్తలు