‘డెత్‌ సర్టిఫికెట్‌ దొరికితే స్వర్గానికి పంపాలా.. నరకానికా?’ వైరలవుతోన్న పేపర్‌ యాడ్‌

23 Sep, 2022 15:27 IST|Sakshi

సాధారణంగా డెత్‌ సర్టిఫికెట్‌ చనిపోయిన తరువాత ఇస్తారు. డెత్‌ సర్టిఫికెట్ పొందడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకుంటే అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. ఈ మధ్య కాలంలో బతికున్న వారికి కూడా డెత్‌ సర్టిఫికెట్‌లు జారీ అవుతున్న ఘటనలు మచ్చుకు కొన్ని చూస్తూనే ఉన్నాం. అధికారుల తప్పిదాల కారణంగా మనిషి బతికున్నప్పటికీ చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కల్లో కొకొల్లలు ఉన్నాయి.

తాజాగా డెత్‌ సర్టిఫికెట్‌ విషయంలో ఓ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన డెత్‌ సర్టిఫికెట్‌ పొగొట్టుకున్నట్లు పేపర్‌లో ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్సాంకు చెందిన రంజిత్‌ కుమార్‌ ఈ నెల 7న ఉదయం 10 గంటలకు నాగాన్‌లోని లుమ్డింగ్ బజార్ వద్ద తన మరణ ధ్రువీకరణ పత్రం పోయిందని ఒక పత్రికలో ప్రకటన ఇచ్చాడు. సదరు డెత్‌ సర్టిఫికేట్‌ నంబర్‌ కూడా అందులో పేర్కొన్నాడు. ఐపీఎస్‌ అధికారి రుపిన్ శర్మ ఈ పేపర్‌ ప్రకటన ఫొటోను ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్‌ చేశారు.

‘ఇలాంటివి కేవలం ఇండియాలోనే జరుగుతాయి’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ ప్రకటనను చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ‘ఆ వ్యక్తి స్వర్గంలో నుంచి సాయం కోరుతున్నాడా? ఒకవేళ ఆ ‘మరణ ధ్రువీకరణ పత్రం’ ఎవరికైనా దొరికితే ఎక్కడికి పంపాలి స్వర్గానికా? లేక నరకానికా? ఒక వ్యక్తి తన డెత్‌ సర్టిఫికేట్‌ పోగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే తనకు ఇచ్చేయండి. దయచేసి దీనిని అత్యవసరంగా పరిగణించండి. లేకపోతే ఆ దెయ్యం ఆగ్రహం చెందుతుంది’ అని ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు. 
చదవండి: షాకింగ్‌ ఘటన: మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలు... సీరియస్‌ అయిన మంత్రి

మరిన్ని వార్తలు