చైన్‌ స్నాచర్ల కోసం జొమాటో డెలివరీ బాయ్‌గా మారిన ముంబై పోలీసులు. 3 రోజులు కాపలా

24 Aug, 2022 15:19 IST|Sakshi

ముంబై: పోలీసులకు చిక్కకుండా దొంగలు వివిధ వేషాల్లో తిరుగుతుండటం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కూడా సివిల్‌ డ్రెస్సుల్లో కనిపిస్తుంటారు. కానీ తాజాగా పోలీసులు దొంగలను పట్టుకునేందుకు జొమాటో డెలివరీ బాయ్‌లాగా మారారు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఇద్దరు చైన్‌ స్నాచర్‌లు అనేక దోపీడీలు చేసి పోలీసులకు దొరక్కుండా చుక్కలు చూపిస్తున్నారు. వీరిపై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఓ కొత్త ప్లాన్‌ వేశారు. ముంబై పోలీసులు జొమాటో డెలివరీ బాయ్‌లుగా వేషాధారణ మార్చుకొని చాకచక్యంగా వారిని పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. 

ఈ కేసుకు సంబంధించిన వివారాల ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సోమ్‌నాథ్ ఘర్గే వివరించారు.. ఇద్దరు చైన్‌ స్నాచర్లపై కస్తూర్బా మార్గ్ పోలీస్ స్టేషన్‌లో 3, బంగూర్ నగర్ పీఎస్‌లో ఓ కేసు నమోదయ్యాయి. వీరిని గాలించేందుకు పోలీసుల బృందం రంగంలోకి దిగింది. దాదాపు 300 సిసిటీవీ ఫుటేజీలను పరిశీలించారు. విచారణలో దొంగతనం చేసే సమయంలో ఉపయోగించిన బైక్‌ను రైల్వే స్టేషన్‌ వద్ద పార్క్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు తమ బైక్‌ను  తీసుకెళ్లేందుకు వస్తారని పోలీసులు ఖచ్చితంగా భావించారు.
చదవండి: ఆశ్చర్యం..‘ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు’

దీంతో కస్తూర్బా పోలీసుల బృందమంతా జొమాటో డెలివరీ బాయ్‌ల దుస్తులను ధరించి స్టేషన్‌ వద్ద సుమారు 3 రోజులు వేచి ఉన్నారు. అనంతరం నిందితుల్లో ఒకరు తమ బైక్‌ను తీసుకోవడానికి వచ్చినప్పుడు అతన్ని రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకొని పీఎస్‌కు తరలించారు. అతడిచ్చిన సమాచారం మేరకు మిగితా వారిని నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు బైక్‌లు, దొంగిలించిన గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని ఫిరోజ్ నాసిర్ షేక్, జాఫర్ యూసుఫ్ జాఫ్రీగా గుర్తించారు. ఇద్దరూ విఠల్వాడి, అంబివిలి నివాసితులుగా తెలిపారు. ఇద్దరు 20కి పైగా దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు