ఉద్యోగికి జాబిలి మీద జాగా కొనిచ్చిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ

1 Apr, 2021 18:44 IST|Sakshi

నోయిడా: కష్టపడి చేసినదానికి కాస్తంత ప్రశంస లభిస్తే అదే పదివేలుగా భావిస్తారు ఉద్యోగులు. కానీ నోయిడాలోని ఓ కంపెనీ మాత్రం ఉద్యోగిని అలా ఊరికే మెచ్చుకుని వదిలేయలేదు. ఏకంగా జాబిలి మీద ఎకరా కొనిచ్చింది. ఈ మేరకు ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. జాగరన్‌ నివేదిక ప్రకారం.. బిహార్‌లోని దర్భంగాకు చెందిన ఇఫ్తేకర్‌ రహమానీ నోయిడాలో ఏఆర్‌ స్టూడియోస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నడుపుతున్నాడు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజిన్స్‌ విభాగంలో పని చేసే అతడు అమెరికన్‌ కంపెనీ 'లూనా సొసైటీ ఇంటర్నేషనల్'‌ కోరిక మేరకు ఓ సాఫ్ట్‌వేర్‌ తయారు చేసిచ్చాడు. దీని ద్వారా చంద్రుడి మీద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవచ్చు. ఇక ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిచ్చిన వ్యక్తి ప్రతిభకు మెచ్చిన కంపెనీ అతడిని ఘనంగా సత్కరించింది. ఏకంగా చంద్రమండలం మీద ఎకరం భూమికి యజమానిని చేసింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కూడా సంతోషంతో వేడుకలు జరుపుకుంటున్నారట. ఈ క్రమంలో ఊరందరికీ స్వీట్లు పంచుతున్నారట. ఏదేమైనా ఉద్యోగికి జాబిలి మీద జాగా ఇవ్వడం నిజంగా విడ్డూరమేనంటున్నారు నెటిజన్లు.

చదవండి: నువ్వు నిజమైన జాతిరత్నానివి సామి!

పోలీస్‌ మాట: శానిటైజర్‌ బదులు గంగాజలం, గంధం

మరిన్ని వార్తలు