-

ఆటో డ్రైవర్‌- అతడి ప్రియనేస్తం.. నెటిజన్లు ఫిదా!

28 Dec, 2020 14:29 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రకు చెందిన మంజిరి ప్రభు తన సోదరి లీనాతో కలిసి పుణెలో ఆటో ఎక్కారు. గమ్యస్థానానికి చేరుకోగానే డ్రైవర్‌కు డబ్బు చెల్లించే క్రమంలో కనిపించిన ఓ అతిథి ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. డ్రైవర్‌ కాళ్ల దగ్గర కూర్చుని, రెండు అందమైన కళ్లేసుకుని తదేకంగా తననే గోముగా చూస్తూ దృష్టిని ఆకర్షించింది. ఆ అతిథి పేరు రీని. ఆటో డ్రైవర్‌ హర్వీందర్‌ సింగ్‌ ప్రియనేస్తం అది. ఎల్లప్పుడూ తనతోనే ప్రయాణం చేస్తుంది. కానీ ఎన్నడూ కస్టమర్లను విసిగించకుండా, ఒద్దికగా ఉంటూ విశ్వాసానికి మారుపేరన్న నానుడిని నిజం చేస్తోంది. ‘రియల్‌ లైఫ్‌ శాంటా’’ అంటూ క్రిస్మస్‌ పర్వదినాన మంజిరి, సదరు ఆటోడ్రైవర్‌- అతడి పెంపుడు కుక్కకు సంబంధించిన విశేషాలను తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేశారు. ఈ స్టోరీ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

‘‘ఈరోజు నేను నిజమైన శాంటాను కలిశాను. నా సోదరి లీనా, నేను ఆటో ఎక్కాం. దిగిన తర్వాత డ్రైవర్‌కు డబ్బు ఇస్తున్నాను. అప్పుడే ఓ కుక్కపిల్ల నా కంటపడింది. డ్రైవర్‌ కాళ్ల దగ్గర ఓ రగ్గుమీద కూర్చుని నన్నే చూస్తోంది. కానీ ప్రయాణం చేస్తున్నంత సేపు తన అలికిడి అస్సలు వినిపంచనేలేదు. వాడి పేరు రోనీ అట. ఆటోడ్రైవర్‌ చెప్పారు. వీధిలో బేలగా చూస్తున్న ఆ కుక్కపిల్లను అతడి కొడుకు ఓ రోజు ఇంటికి తీసుకువచ్చాడట. అయితే ఎవరిపనుల్లో వారు బిజీగా ఉండటంతో పప్పీని చూసుకోవాల్సిన బాధ్యతను హర్వీందర్‌ తీసుకున్నారట. 

ఇంటి నుంచి బయల్దేరే ముందే తనతో పాటు రోనీకి కూడా భోజనం, బిస్కట్లు ఓ బాక్సులో సర్ది తనవెంటే తీసుకువెళ్తారట. నేను ఈ ఫొటో తీస్తుంటే హర్వీందర్‌ సింగ్‌ కాస్త మొహమాటపడ్డారు. కానీ కానీ అంతటి దయార్థ హృదయం కలిగిన వారు ఎంతమంది ఉంటారు. సాటి మనుషులను కూడా పట్టించుకోని వ్యక్తులు ఉన్న సమాజంలో మూగజీవి పట్ల ఇంత కేరింగ్‌ తీసుకుంటున్న ఆయన ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తున్నారు. వాళ్లిద్దరి బంధం చూస్తే నాకు ముచ్చటేస్తోంది’’ అని మంజిరి పేర్కొన్నారు.(చదవండి: వైరల్‌గా మారిన బస్‌ డ్రైవర్‌ ఫొటో..)  

మరిన్ని వార్తలు