అంతా అవాక్కయ్యారు.. సోదరి పెళ్లికి రూ.8 కోట్ల విలువైన బహుమతులు!

28 Mar, 2023 12:29 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లోని నాగౌర్‌లోని ఖిమ్‌సర్ తాలూకాలోని ధిగ్‌సార గ్రామానికి చెందిన నలుగురు సోదరులు తమ సోదరి పెళ్లిలో కోట్లు విలువైన సంపదను కానుకగా ఇచ్చి తమ ప్రేమను చాటుకున్నారు. వివాహ వేడుకలో విలువైన బహుమతులును ఇవ్వడం అక్కడి సంప్రదాయమట. భగీరథ్ మెహ్రియా, అర్జున్ మెహ్రియా, ప్రహ్లాద్ మెహ్రియా, ఉమ్మద్ జీ మెహ్రియా తమ సోదరి భన్వారీకి ఏకంగా 8.1 కోట్లు ఇచ్చారు.

ఆ ప్రాంత స్థానికులు గతంలో ఇద్దరు సోదరులు తమ సోదరికి డాలర్లతో అలంకరించిన తోహ్నీ, కోటి విలువైన కానుకను ఇచ్చారు. బుర్డి గ్రామానికి చెందిన భన్వర్‌లాల్ చౌదరి 3 కోట్ల 21 లక్షలు గిఫ్ట్‌ ఇవ్వగా.. తాజాగా ఈ నలుగురు సోదరులు ఈ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. ప్రస్తుతం భగీరథ్ మెహ్రియా కుటుంబం రూ. 8.1 కోట్ల సంపదను కానుకగా ఇచ్చింది. ఇందులో.. 2 కోట్ల 21 లక్షల నగదు, 71 లక్షల విలువైన 1 కిలోల 105 గ్రాముల బంగారం, 9 లక్షల 80 వేల విలువైన 14 కిలోల వెండి, 2 కిలోల వెండి సోదరికి అందించగా మిగిలిన 800 నాణేలను గ్రామం మొత్తానికి పంపిణీ చేశారు.

వందల సంఖ్యలో కార్లు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, ఎద్దుల బండ్లతో ర్యాలీగా కానుకలను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మైరా సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డ పెళ్లికి అన్నదమ్ములు ఇలా భారీ స్థాయిలో కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందట.

మరిన్ని వార్తలు