Viral Video: స్టేజీపైనే ఆటగాడి చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ

18 Dec, 2021 18:25 IST|Sakshi

రాంచీ: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ బహిరంగంగా ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించారు. స్టేజ్‌పైనే ఆటగాడికి రెండు చెంపలు వాయించడంతో వేదికపై ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని రాంచీలో అండర్‌-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌లో చోటుచేసుకుంది. షహీద్ గణ్‌పత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ భూషణ్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ క్రమంలో ఓ యువకుడికి15 ఏళ్లు దాటడంతో అండర్‌ -15 ఈవెంట్‌లో పాల్గొనేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో తనను పోటీల్లో పాల్గొనడానికి అనుమతించాలని స్టేజ్‌ మీదకు వెళ్లి ఎంపీ సింగ్‌ను పదే పదే ఇబ్బంది పెట్టాడు. దీంతో సహనం కోల్పోయిన ఎంపీ వేదికపై ఉన్న రెజ్లర్‌ను అందరిముందే చెంప దెబ్బ కొట్టాడు. యువ రెజ్లర్‌ వేదిక నుంచి కిందకు దిగుతుండగా రెండు సార్లు అతనిపై చేయిచేసుకున్నాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటగాడిపై ఎంపీ చేయి చేసుకోవడంపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఎంపీ సింగ్‌ ప్రస్తుతం లోక్‌సభలో ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు