Uttarakhand: ప్రవాహంలో చిక్కుకున్న ఏనుగు

20 Oct, 2021 12:11 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తర ఖండ్‌ రాష్ట్రాన్ని భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా మూడోరోజు వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని నదులన్ని నిండు కుండలా ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా, గౌలానది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో.. హల్దూచుర్‌, లల్కున్‌ నదుల మధ్యన పాచ్‌ల్యాంగ్‌ అనే ఒక ద్వీపం ఉంది. అక్కడ ఒక ఏనుగు  మంద నుంచి తప్పిపోయి ప్రవాహం మధ్యలో చిక్కుకుంది.

భీకరంగా ప్రవహిస్తున్న నీటి ఉధృతికి ఏనుగు ముందుకు వెళ్లలేక అక్కడే తిరగసాగింది. అయితే, ఈ దృశ్యాన్ని అభిషేక్‌ పాండె అనే ట్విటర్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అది కాస్త వైరల్‌ గా మారింది. దీనిపై స్పందించిన.. స్థానిక అటవీ డివిజనల్‌ అధికారి సందీప్‌ కుమార్‌.. తన సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించారు. ఆ తర్వాత ఏనుగును అటవీ మార్గం వైపు వెళ్లేలా చేశారు.

ప్రస్తుతం ఏనుగు ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఏనుగు ప్రాణాలు కాపాడిన సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పటికే  ఉత్తరఖండ్ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి వరదల కారణంగా ఆ రాష్ట్రంలో రెడ్‌ అలెర్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. 

చదవండి: భారీ ప్రవాహంలో చిక్కుకున్న కారు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు