దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే బాధితుల్ని కాపాడేందుకు డాక్టర్లు నిర్విరామంగా పనిచేస్తున్నారు. రోగుల ఆర్తనాదాల మధ్య పని ఒత్తిడి, ఆస్పత్రుల్లో మరణాలు లాంటివి భయాలు ఉన్నా తమ పనిని కొనసాగిస్తున్నారు. ఓవైపు బాధితులకు చికిత్స అందిస్తూనే వారిలో ధైర్యం నింపుతున్నారు. మరికొంత మంది, కోవిడ్ పేషెంట్లలో ఉత్సాహాన్ని నింపేందుకు పీపీఈ కిట్లు ధరించి డ్యాన్స్లతో వారికి ఆహ్లాదం పంచుతున్నారు. పంజాబీ సాంగ్ ‘జిందగీ’కి వైద్యులు స్టెప్పులేస్తుంటే బాధితులు చప్పట్లు కొడుతూ తమ బాధను మరిచిపోయే ప్రయత్నం చేస్తున్నారు.
ఓ కోవిడ్ వార్డులోని దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుర్మీత్ చద్దా అనే నెటిజన్ దీనిని షేర్ చేశారు. ‘‘వైద్యులకు, ఇతర వైద్య సిబ్బందికి హాట్సాఫ్.. ఈ అందమైన పాటకు స్టెప్పులేస్తూ.. వారితో పాటు మా అందరి పెదవులపై చిరునవ్వులు పూయించారు’’ అని కామెంట్ జత చేశారు. ఈ క్రమంలో కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతూనే, బాధితుల్లో ధైర్యం నింపేందుకు మీరు ప్రయత్నిస్తున్న తీరు మా మనసులు కరిగించిందంటూ పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. కాగా 2019 లో విడుదలై ఈ పంజాబీ పాటను రచయిత, సింగర్ షారీ మాన్ ఆలపించారు.
చదవండి: ఆసుపత్రిలో కోవిడ్ బాధితుడు చేసిన పనికి కలెక్టర్ ఫిదా..