Viral Video: ఖాళీ చేతులతో స్కూల్‌ టాయిలెట్లు శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ..

23 Sep, 2022 21:04 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ గుణ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది విద్యార్థినులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ కనిపించిన వీడియో శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇది జరిగి 24 గంటలు గడవకముందే రాష్ట్రంలో ఇలాంటి కోవకే చెందిన మరో ఘటన వెలుగు చూసింది. అయితే ఈసారి పిల్లలు కాకుండా బీజేపీ ఎంపీ జనార్ధన్‌ మిశ్రా బాలికల పాఠశాలలో టాయ్‌లెట్లు శుభ్రం చేస్తూ కనిపించారు. అయితే ఆయన ఎలాంటి బ్రష్‌ సాయం లేకుండా తన చేతులతో క్లీన్‌ చేయడం గమనార్హం. ఈ వీడియోను బీజేపీ ఎంపీ ట్వీట్‌ చేశారు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బీజేపీ యువ మోర్చా యూత్‌ వింగ్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘సేవా పఖ్‌వాడా) కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 17న మొదలైన ఈ కార్యక్రమం అక్టోబర్‌ 2న మహాత్మాగాంధీ జయంతి రోజున ముగించనున్నారు. ఇందులో భాగంగా  మధ్యప్రదేశ్‌లోని రేవా నియోజకవర్గంలోని ఖట్కారి బాలికల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమానికి స్థానిక నియోజకవర్గ ఎంపీ జనార్ధన్‌ మిశ్రా ముఖ్య అతిథిగా వచ్చారు. తన సందర్శనలో పాఠశాల మరుగుదొడ్లు(టాయిలెట్స్‌) పరిశుభ్రంగా లేకపోవడాన్ని ఎంపీ గమనించారు. దీంతో ఆయనే స్వయంగా తన చేతులతో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మహాత్మాగాంధీ, మోదీ ఇచ్చిన నినాదాన్ని గుర్తు చేశారు. ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఇదేం మొదటిసారి కాదని అన్నారు.

మరిన్ని వార్తలు